న్యూఢిల్లీః ఇండియా-చైనా మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఇండియన్ ఆర్మీ చేసిన పనికి చైనా ఆర్మీ కృతజ్ఙతలు చెప్పారు. అయితే ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్లోని చైనా బార్డర్లో జరిగింది.
అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలను బంధించిన ఇండియన్ ఆర్మీ వాటిపై మానవత్వం చూపుతూ.. ఈ నెల 7న చైనా సైన్యానికి అప్పగించారు. ఈ విషయాన్ని ఈస్ట్రన్ కమాండ్ వెల్లడించింది. చైనా సైనికాధికారులు స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారని ట్వీట్ చేసింది.
చైనా సరిహద్దుల్లో నిత్యమూ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడి, ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి చర్యలు ఉద్రిక్తతలు తగ్గేందుకు సహకరిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, చైనా ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నారావణే గత వారం చివర్లో లడఖ్ లో పరిస్థితిని సమీక్షించిన అనంతరం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం రెండు దేశాల జవాన్లూ ప్రయత్నాలు జరుపుతున్నారు. ఫింగర్ గాల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది.