వాషింగ్టన్: చైనా సైనిక – అనుబంధ నిపుణులపై అమెరికా కోర్టులలో విచారణను వెంటనే నిలిపివేయాలని అమెరికాను చైనా హెచ్చరించింది.
లేదంటే తమ దేశంలోని అమెరికన్లను అదుపులోకి తీసుకుంటామంటూ చైనా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు వాల్స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.
జులైలో అమెరికా విద్యా సంస్థల్లో పరిశోధన చేసేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసిన సమయంలో.. ముగ్గురు చైనా పౌరులు తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సభ్యత్వాలను దాచిపెట్టారంటూ , దీంతో వారిని ఎఫ్బిఐ అదపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గత నెలలో వెయ్యిమందికి పైగా చైనా పౌరుల వీసాలను అమెరికా రద్దు చేసిందని, ఈ చర్యలను మానవహక్కుల ఉల్లంఘనగా చైనా వ్యాఖ్యానిస్తోంది.
చైనా ప్రభుత్వం అమెరికా పౌరులను, ఇతరులను విదేశీ ప్రభుత్వాలపై బేరాసారాలు సాగించేందుకు వీలుగా వారిని ఏకపక్షంగా నిర్బంధించడం, బహిష్కరించడం వంటివి చేస్తుందని అమెరికా విదేశాంగ శాఖ సలహాదారు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే ప్రథమ ఆర్థిక, సైనిక శక్తిగా ఉన్న అమెరికా స్థానాన్ని కొల్లగొట్టేందుకు చైనా యత్నిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
అమెరికా సాంకేతిక, సైనిక, ఇతర నైపుణ్యాలను దొంగిలించేందుకు చైనా సైబర్ దాడులు చేస్తోందని, గూఢచర్యానికి పాల్పడుతోందని ఆయన వాదిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు చైనా ప్రభుత్వం ఖండించింది.