అమరావతి: రేషన్ సరుకుల ధరలను వైసీపీ ప్రభుత్వం మరోసారి పెంచనుంది.
నాలుగు నెలల కిందటే ధరల పెంపునకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే కేంద్రం ఉచిత బియ్యం పంపిణీ గడువును పొడిగించడంతో వెనక్కు తగ్గింది.
ఇప్పటికే కిలో పంచదారపై 14 రూపాయలు పెంచగా.. ఇప్పుడు కందిపప్పుపై 27 రూపాయలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మేరకు రేషన్ డీలర్ల నుంచి డీడీలు కూడా స్వీకరిస్తోందని తెలుస్తోంది.
కొన్ని సంవత్సరాలుగా కందిపప్పు కిలో 40 రూపాయలకే ఇస్తుండగా.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఒకేసారి 27 రూపాయలకు పెంచేసింది.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో ధర 100 రూపాయలపైన ఉంది.
ఇప్పటికే పంచదార ధరను 10 రూపాయల నుంచి 17 రూపాయలు చేసింది.
ఈ పెంపు వల్ల నెలకు కందిపప్పుపై 40 కోట్లు, పంచదారపై 10 కోట్లు ప్రజలపై భారం పడనుంది. అంటే ఏడాదికి 600 కోట్ల రూపాయల భారం.
కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా రేషన్ సరుకుల ధరలు పెంచాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.