CM KCR Aerial Survey : నేడు, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన
CM KCR Aerial Survey : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి.
వేలాది మంది ప్రజలు గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు తరలారు.
పరీవాహాక ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ నేడు, రేపు ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
శనివారం సాయంత్రమే వరంగల్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ సీనియర్ నేత కెప్టెన్ వీ. లక్ష్మీకాంతారావు ఇంటిలో రాత్రి బస చేశారు.
మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే ప్రారంభించనున్నారు.
ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలికాప్టర్లో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తారు.
ఆ తరువాత భద్రాచలంలో పర్యటించి వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఏటూరు నాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారు.
వరద సహాయక చర్యలపై అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు.
ఏటూరు నాగారం నుంచి సాయంత్రం సమయంలో కేసీఆర్ తిరిగి హైదాబాద్కు వస్తారు.
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొంటారు.
సోమవారం ఉదయం ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టి, వరద బాధితులను పరామర్శిస్తారు.
ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ముంపు ప్రజలకు ఇబ్బందలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన విషయం విధితమే.
పునరావాస కేంద్రాల్లో బాధితులకు సరియైన సౌకర్యాలు కల్పించాలని , ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.