మండలిలో సీఎం కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారమే ఉండదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. బిల్లు రూపకల్పన, సంస్కరణల గురించి సభ్యులకు సీఎం వివరించారు. పేద రైతులకు ప్రయోజనంతోపాటు ఒక్కపైసా అవినీతికి తావులేని పద్ధతిలో మూడేళ్లు కష్టపడి చట్టానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. ధరణి పోర్టల్ని పగడ్బందీగా రూపొందించామని, దీని ద్వారా తహసీల్దార్లు, తహసీల్దార్లు సైతం అవినీతి చేయలేరని సీఎం స్పష్టం చేశారు. బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫోటోతో సహా అన్ని వివరాలు నమోదు చేస్తేనే ధరణి పోర్టల్లో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. అరగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే వ్యవస్థ తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. రెవెన్యూ కోర్టులు రద్దు చేశామని, వాటి స్థానంలో ఫాస్ట్ ట్రాక్ ట్రైబ్యునల్లు పని చేస్తాయని సీఎం వెల్లడించారు.
సింగరేణిలో కారుణ్య నియామకాలు
సింగరేణి సంస్థలో అర్హులైన వారుంటే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల్లోకి తీసుకుంటామని శాసనసభలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బొగ్గు గనుల్లో పని చేసే సిబ్బందికి ఆదాయపు మినహాయింపులపై పార్లమెంట్లో పోరాడతామని చెప్పారు. పదవీ విరమణ పొందిన రోజే ఉద్యోగికి ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి అందించేలా ప్రత్యేక విధానం తీసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చారు.