Homeక్రైంఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర!

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర!

– భగ్నం చేసినట్లు పేర్కొన్న​అమెరికా
– ఫైనాన్షియల్ టైమ్స్​లో కథనం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్​ఎఫ్​జే) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ పశ్చిమ దేశాల పత్రికలు కథనాలు వెలువరించాయి. ఆ కుట్రను తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం వెల్లడించినట్లు వాటిల్లో తెలిపాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే భారత విదేశాంగశాఖ దీనిపై పరోక్షంగా స్పందించింది. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. తమ గడ్డపై గురుపత్వంత్‌ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేశామని అమెరికా వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. ‘ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల వద్ద దీనిని ప్రస్తావించాం. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై న్యూఢిల్లీ తదుపరి దర్యాప్తు చేస్తుందని మాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది. ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం’అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్‌ వాట్సన్‌ చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.


ఎఫ్​బీఐ దర్యాప్తు..


ప్రస్తుతం ఈ ఘటనపై అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నట్లు అగ్రరాజ్య అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ కుట్ర గురించి అమెరికాకు ఎలా తెలిసింది? కుట్రను ఎలా భగ్నం చేశారన్న వివరాలను మాత్రం సదరు వర్గాలు బయటపెట్టలేదు. మరోవైపు దీనిపై స్పందించేందుకు అమెరికా ఎఫ్‌బీఐ, న్యాయశాఖ నిరాకరించింది.


ఈ సమాచారాన్ని పరిశీలిస్తున్నం


ఈ కథనాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి స్పందించారు. ‘భారత్‌-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ఆ సమాచార తీవ్రతను భారత్‌ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి’అని బాగ్చి వెల్లడించారు. సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటువాద సంస్థను భారత్‌ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్నూ కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో ఉంటున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img