జెనీవా: ప్రపంచ జనాభాలో ప్రతి పది మందిలో ఒకరు కొవిడ్ బారిన పడి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంచనా వేసింది.
డబ్ల్యూహెచ్వో ఉన్నత స్థాయి అత్యవసర నిపుణుడు మైక్ ర్యాన్ సోమవారం ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా 10శాతం మంది కొవిడ్ బారిన పడ్డట్లు డబ్ల్యూహెచ్వో అంచనా వేస్తోంది. దేశం, గ్రామీణ, నగర ప్రాంతాలను బట్టి దీని ప్రభావం మారుతోందని లెక్కలు కట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ పుట్టుకపై విచారణ జరిపేందుకు చైనా వెళ్లే నిపుణులకు సంబంధించిన జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి ఆందోళన స్థాయిలో కొనసాగుతోందన్నారు. యూరప్ సహా తూర్పు మధ్య ప్రాచ్యంలోని ప్రాంతాల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయన్నారు.