Homeజాతీయం10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్

10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్

– దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తోన్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో దసరా పండగ సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఈ అనూహ్య మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సీపీఆర్‌ టెక్నిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా అమలుకానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది.

జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ మరణాలు 12.5 శాతం పెరిగాయి. ఈ గుండెపోటు మరణాల గురించి ఇదివరకు మాండవీయ మాట్లాడుతూ.. కొవిడ్‌-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనాన్ని ఉదహరించారు. ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా 1052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. వారిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసువారే. ఇలా గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో సీపీఆర్‌(సీపీఆర్)పై దాదాపు 2లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Recent

- Advertisment -spot_img