Homeక్రైంCrime News : BRS​ ఎంపీపై హత్యాయత్నం

Crime News : BRS​ ఎంపీపై హత్యాయత్నం

  • ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి
  • ప్రచారంలో షేక్​హ్యాండ్​ ఇచ్చేందుకు వచ్చి పొడిచిన వైనం
  • యశోద ఆస్పత్రికి తరలింపు
  • సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​ మండలంలో ఘటన
  • దగ్గరుండి వైద్యం చేయిస్తున్న మంత్రి హరీశ్​రావు
  • ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం కేసీఆర్​
  • ఘటనను ఖండించిన గవర్నర్​ తమిళిసై

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డికి హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు ప్రభాకర్​ రెడ్డిపై కత్తితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి ప్రస్తుతం దుబ్బాక బీఆర్ఎస్​ అభ్యర్థిగా సైతం పోటీ చేస్తున్నారు. కాగా ప్రచారంలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో పర్యటిస్తుండగా.. ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దుండగుడిని గన్‌మన్ అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొత్త ప్రభాకర్​ గాయపడటంతో ఆయనను హుజాహుటిన గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆయనకు బలమైన గాయమైందని వైద్యులు తెలిపారు. కడుపులో 3 ఇంచుల వరకు కత్తి దిగిందని వెల్లడించారు. అంతర్గతంగా రక్తస్రావం అయిందన్నారు. ఆపరేషన్ థియేటర్‌లోకి తరలించి సర్జరీ నిర్వహిస్తున్నారు.

హుటాహుటిన ఆస్పత్రికి హరీశ్​

దాడి ఘటన గురించి తెలియగానే.. మంత్రి హరీశ్​రావు ఆస్పత్రికి వచ్చారు. అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రభాకర్​రెడ్డి కుటుంబసభ్యులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని, అధైర్యపడవద్దని హరీశ్​రావు పిలుపునిచ్చారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ‘ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి అత్యంత గర్హనీయం. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది’ అని హరీశ్​రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను సీఎం కేసీఆర్ సైతం తీవ్రంగా ఖండించారు. యశోద ఆస్పత్రికి వెళ్లి కొత్త ప్రభాకర్​ రెడ్డిని పరామర్శించారు.

కుట్ర కోణంలో దర్యాప్తు

ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు రాజు 10 రోజుల కిందటే బీజేపీలో చేరినట్టు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు సమక్షంలో అతడు కాషాయ కండువా కప్పుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నిందితుడు ఓ యూట్యూబ్​ చానెల్​లో విలేకరుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద వివిధ మీడియా సంస్థలకు మొత్తం 8 ఐడీ కార్డులు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

ప్రజా స్వామ్యంలో హింసకు చోటు లేదు: గవర్నర్ తమిళిసై

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసే సమయంలో వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం శాంతియుత వాతావరణాన్ని ఉండేలా చూడటం చాలా అవసరం’అని గవర్నర్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img