– లష్కరే తోయిబాకు చెందిన
ఖ్వాజా షహిద్ను పీవోకే దారుణంగా చంపిన దుండగులు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్పై 2018లో జరిగిన దాడి వ్యూహకర్తను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఖ్వాజా షహిద్ అలియాస్ మియా ముజాహిద్.. గతంలో సుంజ్వాన్ క్యాంప్పై దాడి చేయించాడు. ఈ దాడిలో అప్పట్లో ఐదుగురు సైనికులు సహా ఒక పౌరుడు మృతి చెందాడు. తాజాగా పీవోకేలోని ఓ ప్రాంతంలో ఖ్వాజా షహిద్ తలలేని మృతదేహాన్నిదర్యాప్తు అధికారులు గుర్తించారు. అతడిని తీవ్రంగా హింసించి చంపినట్లు చెబుతున్నారు. పీవోకేలోని నీలం లోయ ప్రాంతంలో ముజాహిద్ ఉంటున్నాడు. అతడిని శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతడి బాడీగార్డుల కళ్లుగప్పి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పాకిస్థాన్ సైన్యం, ఇతర దళాలు గాలింపు చేపట్టాయి. ఆదివారం అర్ధరాత్రి అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఖ్వాజా షహిద్తో కలిపి పాకిస్థాన్లో ఇప్పటి వరకూ మొత్తం 18 మంది భారత వ్యతిరేక కార్యకలాపాలు జరిపేవారు మృతి చెందినట్లు ‘టైమ్స్నౌ’ పేర్కొంది. గత నెలలో జైషే చీఫ్ మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడైన దావుద్మాలిక్ను నార్త్ వజీరిస్థాన్లో పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. హిజ్బుల్ చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితడు ముఫ్తీ ఖైజర్ ఫారుఖీని కరాచీ నడిబొడ్డున హత్య చేశారు. ఈ ఘటన లష్కరే ఉగ్ర సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఐసీ-814 విమానం హైజాక్లో కీలక పాత్ర పోషించిన జైషే ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. ఈ వరుస ఘటనలు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐను ఉక్కిరిబిక్కిరి చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.