పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్పై భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నది.
24 గంటలపాటు ప్రచారం జరుపకుండా ఆయనపై నిషేధం విధించింది.
ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు దిలీప్ ఘోష్ పై ఆరోపణలు వచ్చాయి.
దీనిని విచారించిన ఎన్నికల సంఘం ఈ మేరకు 24 గంటలపాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
ఏప్రిల్ 16 న రాత్రి 7 గంటల వరకు ఘోష్ ప్రచారం చేయకుండా నిషేధించనున్నట్లు ఈసీఐ నోటీసులో పేర్కొన్నది.
ఏప్రిల్ 10 న కూచ్ బెహార్ లోని సితాల్కుచి అసెంబ్లీ నియోజకవర్గంలో నలుగురి హత్యలపై దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు పంపింది.
రెండు రోజుల తరువాత ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఈ హత్యలను “మారణహోమం” గా అభివర్ణించారు.
“ఎన్నికల విధి నిర్వహణలో కేంద్ర దళాల రైఫిల్స్ కేవలం ప్రదర్శన కోసం మాత్రమే ఉన్నాయని భావించిన కొంటె కుర్రాళ్లు.. సితాల్కుచిలో ఏమి జరిగిందో చూసిన తర్వాత అదే తప్పును పునరావృతం చేయలేరు” అని ఘోష్ వ్యాఖ్యానించారు.
“కొంటె అబ్బాయిలకు సితాల్కుచి వద్ద బుల్లెట్లు వచ్చాయి.
చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరైనా ధైర్యం చేస్తే ఇదే జరుగుతుంది”అని ఆయన అన్నారు. దాంతో ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది.