హైదరాబాద్: గత కొన్నిరోజులుగా సామాన్య ప్రజల కంటనీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు తగ్గుముఖం పడునున్నాయి.
రెండు నెలల క్రితం వరకూ రూ.50 రూపాయలకు నాలుగు కిలోల ఉల్లిపాయలు వచ్చేవి. కానీ రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా మళ్లీ ధరలు ఆకాశాన్నంటాయి.
వర్షాలకు ఉల్లిపంటలు పాడైపోవడంతో మార్కెట్లకుసరఫరా తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి.
తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మార్కెట్లో రిటైల్ ధర కిలోకు రూ.80 నుంచి రూ.100 రూపాయలు పలికింది. దీంతో సామాన్య ప్రజలు ఉల్లిగడ్డ కొనడమే మానేసే పరిస్థితి ఏర్పడింది.
పెరిగిన సరఫరా
మహా రాష్ట్ర నుంచి నగరానికి వచ్చే దిగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా 60 నుంచి 70 శాతం ఉల్లి దిగుమతి మహారాష్ట్ర నుంచి వస్తుందన్న సంగతి తెలిసిందే.
నెల రోజుల క్రితం వరకూ రోజుకు 50 నుంచి 60 లారీల మేరకు దిగుమతి కాగా ప్రస్తుతం 80 నుంచి 100 లారీలు దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు.
దీంతో ప్రస్తుతం కిలో ఉల్లిగడ్డ రూ.40 నుంచి రూ.50 రూపాయలు పలుకుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.