HomeSocial Mediaదేవుడిపై ఒట్టేస్తే రైతులకు న్యాయం జరగదు: కిషన్ రెడ్డి

దేవుడిపై ఒట్టేస్తే రైతులకు న్యాయం జరగదు: కిషన్ రెడ్డి

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, 45 రోజులుగా ధాన్యం వస్తున్నా.. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగడం లేదని ఆరోపించారు. భువనగిరి సెగ్మెంట్ బీబీనగర్ మండలంలోని రాఘవపూర్, రుద్రవెల్లి గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. కొనుగోళ్ల తీరుతోపాటు పీఏసీఎస్‌ కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఈ విషయంలో బీఆర్ఎస్ మోసం చేసింది. అదే దారిలో హస్తం పార్టీ నడుస్తోంది. రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో కేసీఆర్ ‘వరి వేస్తే ఉరి’అన్నారు. దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని ఇప్పుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అన్నదాతలకు రుణమాఫీ లేదు.. బోనస్ లేదు. కాంగ్రెస్ సర్కారు తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. దేవుడి మీద ఒట్టు పెడితే వ్యవసాయదారులకు న్యాయం జరగదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉంది’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి..
రైతుల్లో వ్యతిరేకతను తెచ్చుకునేందుకు బీఆర్ఎస్​ పదేళ్లు పడితే… కాంగ్రెస్‌కు 5 నెలలే పట్టిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘దొడ్డు వడ్లు పండించే రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ సహించదు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలి. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. బ్యాంకర్లు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ నెరవేర్చలేదు. కానీ, ఆ పార్టీ నేతలు ఢిల్లీకి సూట్‌కేస్‌లు మోసుకెళ్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గద్దె దిగాలి’అని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కిషన్ రెడ్డి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు గోలీ మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img