- కారును ఢీ కొట్టిన లారీ
- అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
- ముగ్గురికి తీవ్ర గాయాలు
- వేములవాడ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం
- మృతులు ములుగు జిల్లా ఏటూరునాగారం వాసులుగా గుర్తింపు
ఇదేనిజం, ములుగుప్రతినిధి : ఉమ్మడి వరంగల్ ఎల్కతుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ శివారులో కారు -లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ దేవాలయానికి ములుగు జిల్లా ఏటూరు నాగారం వాసులు గురువారం అర్ధరాత్రి బయలు దేరారు. అర్ధరాత్రి మంచు ఎక్కువ ఉండటంతో ముందు వచ్చే వాహనం కనిపించకపోవడంతో శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్థానికులు, జేసీబీ సాయంతో కారులో ఇరుక్కుపోయిన వారిని అతికష్టంమీద బయటకు తీశారు. మంతెన కాంతయ్య,(72)శంకర్,(60)భరత్,(29) చందన, (30), అక్కడికక్కడే మృతి చెందారు. మంతెన రేణుక , మంతెన భార్గవ్ ,మంతెన శ్రీదేవి గాయపడ్డారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.