హైదరాబాద్ః కార్మిక నేత.. తొలి, మలి తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పొషించిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు. బుధవారం అర్ధరాత్రి 12.25కు తుదిశ్వాస విడిచారు.
గత నెల 28న కరోనా పాజిటివ్ తేలడంతో బంజారాహిల్స్ లోని ఓహాస్పిటల్ లో చేరారు. 16 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా రు.
నాయినికి కొడుకు దేవేందర్ రెడ్డి , బిడ్డ మతరెడ్డిఉన్నారు. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జీహెచ్ఎంసీ రామ్ నగర్ డివిజన్ కార్పొరే టర్ గా కొనసాగుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో దేవయ్యరెడ్డి , సుభద్రమ్మ దంపతులకు 1940 ఫిబ్రవరి 12న నాయిని పుట్టారు. 1960లో హైదరాబాద్ వచ్చారు.
వీఎస్టీలో పరిశ్రమలో కార్మిక నేతగా కార్మికుల హక్కుల కోసం పోరాడారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్నారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985,2004ల్లోనూ గెలిచారు.
2001 టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి కేసీఆర్ వెంటనడిచారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పొత్తు లో భాగంగా నాటి వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేరారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ కేబినెట్ లో తొలి హోం మంత్రిగా 2014 నుంచి 2018 వరకు పని చేశారు.
నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్లో ,ప్రభుత్వంలో కలిసి పనిచేసిన అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు.