రైళ్లలో ప్రయాణించే సీనియర్ సీటిజన్లకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ఎక్కువగా సీనియర్ సీటిజన్లు లోయర్ బెర్త్ను కోరుకుంటారు. రాత్రి పూట ప్రయాణం చేసే వారిలో అప్పర్ బెర్త్లో సీటు వస్తే ఇబ్బందులు పడుతుంటారు. దీంతో లోయర్ బెర్త్ సీటు వచ్చిన వారితో ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. అయితే ఇకపై ఈ సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధ ప్రయాణికులకు లోయర్ బెర్త్ల రిజర్వేషన్కు ప్రాధాన్యతనిస్తూ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
తాజాగా ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్తో అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులైన బంధువు కోసం లోయర్ బెర్త్ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్ల కేటాయింపుపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఈ అంశం కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీంతో అధికారులు సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లో ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక టికెట్లను బుక్ చేసుకునే సమయంలో లోయర్ బెర్త్ కావాలనుకునే వారు లోయర్ బెర్త్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విధానంలో సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.