గ్రూప్ 1కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. గత ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. రెండు సార్లు పరీక్ష నిర్వహించినా రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. గతంలో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది. దీంతో త్వరలో కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లింది. అయితే తాజాగా గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంది.