Homeఫ్లాష్ ఫ్లాష్ఆటో కార్మికుల కోసం ఇంటిని తాకట్టు పెట్టిన హరీశన్న

ఆటో కార్మికుల కోసం ఇంటిని తాకట్టు పెట్టిన హరీశన్న

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏ పనిచేసిన తనదైన శైలిలో చేస్తారు. ప్రజల మనసులు దోచుకుంటారు. మంచి మంత్రిగా, నాయకుడిగా ఇప్పటికే ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి హరీశన్న మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.

తన ఇంటి స్థలాన్నే బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 45 లక్షలు రుణం తీసుకున్నారు. ఆ సొమ్మును ఆటో కార్మికుల సంఘం ఖాతాలో జమ చేయించి ఆటో కార్మికుల హృదయాలను దోచుకున్నారు.

ఈ సందర్భంగా ఇవాళ ఆ సంఘాన్ని ఆయన ప్రారంభించి సభ్యులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, లైసెన్స్‌, జత యూనిఫాం అందించనున్నారు.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేయాలని భావించారు మంత్రి హరీశ్ రావు.

రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మికుల పరపతి సంఘం కోసం సభ్యులు తమ వాటా ధనంగా ఒక్కొక్కరు రూ. 1,110 చొప్పున మొత్తం రూ. 8.55 లక్షలు జమచేశారు.

కానీ, సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చుల నిమిత్తం కొంత మొత్తం ఖర్చయింది.

మిగిలిన సొమ్ము మూలధనంగా సరిపోదని అధికారులు చెప్పడంతో డ్రైవర్లు అందరూ కలిసి మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు వినిపించారు.

దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వం నుంచి సంఘానికి డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రంగధాంపల్లిలో ఉన్న తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 45 లక్షలు తీసుకుని ఆ మొత్తాన్ని మూలధనంగా జమ చేయించారు. ఫలితంగా రూ. 53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది.

666 మంది కార్మికులకు రూ. 2 లక్షల చొప్పున బీమా ప్రీమియం చెల్లించారు. సిద్దిపేట డీటీవోతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఇప్పించారు.

‘మూలధనాన్ని సమకూర్చుకోలేని పరిస్థితి తెలిసి తనకు తోచిన సాయం చేసిన. తన సాయంతో ఆటోకార్మికులు నిలదొక్కుకుంటే అదే తనకు చాలు.’ అంటూ ఎప్పటిలాగే సింపుల్ గా హరీశన్నచెప్పారు.

Recent

- Advertisment -spot_img