Homeలైఫ్‌స్టైల్‌#Health #Diet : నమ్మకాలు-నిజాలు.. చికిత్స-పత్యం

#Health #Diet : నమ్మకాలు-నిజాలు.. చికిత్స-పత్యం

కడుపుతో ఉందనీ, బాలింతరాలనీ గత తొమ్మిది పది నెలలుగా కుమారికి పత్యపు కూడే పెడుతున్నారు.

ఈరోజేమైనా సరే.. పకోడీలు తినాల్సిందేనని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. రెండు వారాల పసిబిడ్డ ఏడుపు వినపడడంతో వెంటనే పడగ్గదిలోకి పరుగు తీసింది.

కాసేపటికి కుమారి అత్తగారు వంటగదిలోంచి బయటకు వచ్చి, అందరికీ తలో ప్లేటు పకోడీలు ఇచ్చింది. ఆశగా చూస్తున్న కుమారి వేపు తిరిగి..

“అమ్మాయ్ నువ్వు శెనగపిండి వస్తువులు తినడానికి వీల్లేదుగా.. పచ్చి బాలింతరాలివి పైగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని పదిహేను రోజులు కూడా దాటలేదాయె.

ఆ డబ్బాలో నాన్ రొట్టుంది తిను. వేడి వేడిగా టీ ఇస్తాలే” అని, పకోడీలు తినాలన్న కుమారి ఆశపై నీళ్లు జల్లింది.

కుమారి కథ అలా ఉంటే ఇక్కడ మరో కథ…

జలుబు, జ్వరంతో బాధపడుతున్న జనార్దన్‌.. పసుపు వేసిన పాలు, రొట్టె తప్ప ఇంకేమీ తినకూడదని వాళ్లావిడ అంటోంది.

ఇంకోపక్క… ఏడు నెలల గర్భిణిగా ఉన్న కీర్తన ఎండలకి దాహం ఎక్కువై, కొబ్బరి నీళ్లు తాగుదామని కొబ్బరి బొండం తెప్పించుకుంది.

“రామ రామ గర్భిణిలు కొబ్బరి నీళ్లు తాగితే ఇంకేమన్నా ఉందా? పుట్టబోయే బిడ్డకి జుట్టు మొలవకుండా బోడిగుండు అయిపోదూ” అంటూ ఆ నీళ్లు అవతల పారబోసింది వాళ్లమ్మ.

ఇక కామేశ్వరరావు కథ మరీ అన్యాయం. పచ్చ కామెర్లు తగ్గి ఆరు నెలలు గడిచినా, భర్తకు ఇంకా చప్పిడి మెతుకులే వడ్డిస్తూ ‘అమ్మో.. స్త్రీ పత్యం!’ అంటూ తన మీద చెయ్యి వెయ్యనీయడం లేదు భార్య కమల.

అసలు.. పత్యం అంటే ఏమిటీ? పత్యం లేకపోతే ప్రమాదమా? ఎన్నాళ్లు చేయాలి?

ఈ విషయంలో డాక్టర్లు ఏమంటున్నారో ఓసారి చూద్దామా..

పత్యమంటే ఒక మనిషికి వచ్చిన జబ్బుకు, వారు తీసుకునే చికిత్సకు వ్యతిరేక ఫలితాలనిచ్చే పదార్థాలు తీసుకోకుండా, అనుకూలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడమే.

మనదేశంలో పురాతన కాలం నుంచీ ఉన్న ఆయుర్వేదమూ, ఇంకా ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలో ఈ పత్యానికి ప్రధాన స్థానమిచ్చినట్టు కనపడుతుంది. అందుకే మన దేశంలో పత్యాలెక్కువ.

ఆధునిక వైద్య విధానంలో ఏవో కొన్ని జబ్బులకు తప్ప దాదాపు కఠినమైన పత్యాలు లేవనే చెప్పాలి.

విదేశాల సంగతి నాకు పెద్దగా తెలీదు కానీ మన దేశంలో ఈ పత్యాల గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి.

అవి ఏ స్థాయిలో ఉంటాయంటే ఒక్కోసారి రోగి పత్యమేమీ లేదు అన్న డాక్టర్ని అనుమానంగా చూడటం, అతన్ని సమాధానపరచడానికి డాక్టర్ నానా యాతనా పడటం కద్దు.

అందుకే డాక్టర్‌కి రోగనిర్థారణ చెయ్యడమూ, దానికి తగిన చికిత్స చేయడమూ, రోగికి తన జబ్బుగురించి చక్కని అవగాహన కల్పించడమూ ఒక ఎత్తయితే ,రోగిని సంతృప్తి పరచే పత్యాలు చెప్పడం ఇంకొ ఎత్తు.

సంతృప్తిపరచే అని ఎందుకంటున్నానంటే మనదేశంలో రోగీ, అతని చుట్టుపక్కల వాళ్లూ కూడి డాక్టర్ సామర్థ్యాన్ని చికిత్స ఇవ్వడంలోనే కాక, పత్యాలు చెప్పడాన్ని బట్టి కూడా అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు.

అందుకే కొంతమంది డాక్టర్లు ప్రమాదం కలిగించని తేలికపాటి ఒకటి రెండు పత్యాలు చెపుతూ వుంటారు.

మరి ఆధునిక వైద్య విధానం అసలు ఏం చెబుతోంది అంటే శరీర ధర్మాన్ని అనుసరించి ఆహారం తీసుకోమని… అంటే ఉదాహరణకి రోగికి దాహం వేస్తోంది అంటే, శరీరంలో నీరు తక్కువయింది, అడుగుతోంది అని అర్థం.

ఆకలి వేస్తోంది అంటే జీర్ణశక్తి బాగానే ఉంది, ఆహారం అవసరం అని అర్థం.

జ్వరాలూ-పత్యాలూ

సాధారణంగా వచ్చే జ్వరాలకి పత్యమంటూ ప్రత్యేకంగా ఉండదు.

ఆకలి బాగుంటే భోజనం చేయవచ్చు, అంతగా ఆకలి లేకపోతే, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు పాలూ,రొట్టే లేదా మజ్జిగన్నం, కాఫీ, బిస్కట్ వగైరాలు తినవచ్చు.

కానీ టైఫాయిడ్ జ్వరంలో మాత్రం తప్పనిసరిగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించమంటాం.

ఎందుకంటే కలుషితమైన నీటివల్లా, కలుషితాహారం వలన శరీరంలో ప్రవేశించిన టైఫాయిడ్ సూక్ష్మజీవులు ఆహారపు పేగు గోడలలోని లింఫాటిక్ టిష్యూలో కాపురమేర్పరుచుకుంటాయి.

రోగి ఘన పదార్థాలు తీసుకోవడం వలన, అవి వృధ్ధి పొంది జ్వరం తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది.

అందుకే టైఫాయిడ్ తగ్గుముఖం పట్టే వరకూ కాచి చల్లార్చిన నీళ్లు, తేలికగా జీర్ణమయ్యే ద్రవ పదార్థాలూ, జావలూ తాగమంటాం.

జ్వరం తగ్గిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఘన పదార్థాలూ, కూరా అన్నం తినమని చెబుతూ ఉంటాం.

పత్యం పెట్టాక రోగిని నిద్ర పోనివ్వకుండా నానా హింసా పెట్టేస్తుంటారు చాలామంది.

కోలుకునే దశలో శరీరం ఎక్కువ విశ్రాంతి కోరుకుంటుంది కాబట్టి రోగిని నిద్రపోనివ్వడంలో తప్పులేదు.

ఆపరేషన్లూ – పత్యాలూ

ఇక ఆపరేషన్ జరిగిన వాళ్లల్లో అయితే అది జరిగి ఆర్నెల్లయినా పత్యాల విషయంలో పెట్టే ఇబ్బంది అంతా, ఇంతా కాదు.

కందిపప్పూ, పెసరపప్పూ, శెనగపప్పూ, శెనగపిండీ ఇవేమీ తిన కూడదనీ తింటే కుట్లకు చీము పడుతుందనీ భయపెడతారు. నిజానికి పప్పులలో ప్రొటీన్లుంటాయి.

అవి శరీరానికి ఎంతో అవసరం. చీము పట్టడానికి కారణం, శారీరక అపరిశుభ్రత, పరిసరాల అపరిశుభ్రతా, ఆపరేషన్ పరికరాలు సరిగా స్టెరిలైజ్ చేయకపోవడం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, షుగర్ ఉండటం, ఇంకా కొన్ని ఇతర అంశాలు కారణమవుతాయి.

కానీ, తినే వస్తువుల వల్ల చీము తయారవదు. చీము పట్టే వస్తువులంటూ ఉండవు.

గర్భిణులూ పత్యాలూ

గర్భిణులలో పత్యాల పట్ల ఉండే అపోహలకు అంతే లేదు.

కొబ్బరి నీళ్లు తాగితే పుట్టబోయే పిల్లలకి జుట్టు రాదనీ, తలకాయ కొబ్బరి బొండంలా తయారవుతుందనీ. బొప్పాయి తింటే అబార్షన్ అవుతుందనీ. నువ్వులుండలు తింటే వేడనీ. వంకాయ తింటే వాతమనీ.

బీరకాయ, సొరకాయ నెమ్ము చేస్తాయనీ. కొబ్బరి తింటే దగ్గొస్తుందనీ… ఇలా ఉంటాయి. ఇవన్నీ నిరాధారమైన అపోహలని వేరే చెప్పక్కరలేదు.

ఆమెకు కావలసింది అన్ని రకాలయిన ఆహార పదార్ధాలూ కలిసిన పరిశుభ్రమైన సమతులాహారం.

కాన్పు నెప్పులు మొదలవగానే తలస్నానం చేయించి, ఆమె ఏదికోరితే అది పెట్టాలని మాంసాహారం లాంటివి తినిపించి తీసుకొస్తారు.

ఇక చూడాలి ఆమె పాట్లూ, మా పాట్లూ. కానుపు నెప్పుల తీవ్రతకి చాలాసార్లు తిన్నదరక్క వాంతి అయిపోయి హైరానా అవడం. మామూలు కానుపయితే కొంతవరకూ నయమే.

ఆపరేషన్ చెయ్యవలసి వస్తే మత్తిచ్చే సమయంలో ఆహార పదార్థాలు ఊపిరితిత్తులలోకి వెళ్లిపోయి పేషెంట్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. దీనినే “ఆస్పిరేషన్ న్యూమోనియా”అంటారు.

కాబట్టి కానుపు సమయంలో సాధ్యమయినంత వరకూ తేలికపాటి ద్రవాహారం ఇస్తే మంచిది.

బాలింతలూ – పత్యాలూ

ఇక బాలింతరాళ్లలో పెట్టే కఠిన పత్యాల సంగతి సరేసరి. చాలా కూరగాయలను పత్యం పేరుతో తిననివ్వరు.

కారప్పొడీ, నెయ్యీ, వెల్లుల్లీ విస్తారంగా వాడి మజ్జిగా, పెరుగూ ఇవ్వకుండా, ఎంత దాహమేసి నాలుక పీక్కున్నా మంచినీళ్లు చిన్న, చిన్న గ్లాసులతో కొలిచి ఇస్తారు.

దాని వలన డీహైడ్రేషనూ, యూరిన్ ఇన్‌ఫెక్షన్ లాంటి కాంప్లికేషన్ల బారిన పడతారు.

పాశ్చాత్య దేశాలలో ఇంత అన్యాయం లేదనుకుంటా. ప్రసవం కాగానే చక్కని బలవర్థకమయిన ఆహారం ఇస్తారు.

నిజానికి బిడ్డకు పాలివ్వాలంటే బాలింతరాలికి కావలసింది సమతులాహారం… అంటే పాలూ, పండ్లూ, ప్రొటీన్లూ సమృధ్ధిగా ఉండే ఆహారం.

పచ్చకామెర్లూ – పత్యాలూ

పచ్చ కామెర్లు అనేది కాలేయానికేదైనా సమస్య వచ్చినపుడు బయటకు కనిపించే లక్షణం.

అంటే కాలేయానికి సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా మనకు బయటకు కనిపించే లక్షణం పచ్చకామెర్లు. ఇది రక్తంలో బిల్ రుబిన్ అనే పదార్థం స్థాయిని మించి ఉండటం వలన వచ్చే జబ్బు.

ఈ స్థాయిని కాలేయం నియంత్రిస్తూ ఉంటుంది.

బిల్ రుబిన్ స్థాయి పెరిగినపుడు, ఒళ్లంతా పచ్చబడటం, కళ్లు పచ్చబడటం, మూత్రం పచ్చగా రావడంతో బాటు, ఆకలి లేకపోవడం, జీర్ణశక్తి తగ్గడం, నీరసం, నిస్త్రాణ లాంటి లక్షణాలుంటాయి.

కాలేయ వ్యాధులకు అనేక కారణాలున్నాయి. జన్యుపరమైన లోపాల నుంచీ కేన్సర్ వరకూ లివర్ వ్యాధికి కారణమవవచ్చు.

వాటిలో సాధారణంగా మనం చూసేవి, అప్పుడే పుట్టిన బిడ్డలో రక్తం మారి కొత్త రక్తం ఏర్పడేటప్పుడు వచ్చే “ఫిజియొలాజికల్ జాండిస్” ఒకటి.

ఇది బిడ్డ పుట్టిన మూడు నాలుగు రోజులకు మొదలయి, వారం రోజులకు దానంతట అదే తగ్గు ముఖం పడుతుంది.

సాధారణంగా ఏ చికిత్సా అవసరం వుండదు.

అరుదుగా బిల్ రుబిన్ స్థాయి పెరిగితే పిల్లల డాక్టర్లు ఫొటోథెరపీ ఇస్తారు లేకుంటే కాసేపు పొద్దుటే వచ్చే లేత ఎండలో బిడ్డను ఉంచితే సరిపోతుంది.

ఇంకా కొన్ని జన్యు పరమైన లోపాలు, పిత్తాశయంలో వచ్చే రాళ్లూ, ఆల్కహాలూ, కొన్ని రకాల మందులూ, ఇన్ఫెక్షన్లూ, కేన్సర్లూ, అనేక రకాల కారణాల వలన కామెర్లు వస్తాయి.

సాధారణంగా కామెర్లు కలగ జేసేది హెపటైటిస్ ఏ,బీ వైరస్‌లు.

హెపటైటిస్ ఏ – కలుషిత నీరు, ఆహారం వలనా వస్తుంది. సాధారణంగా దానంతట అదే తగ్గి పోతుంది. రోగి నీరస పడకుండా సపోర్టివ్ థెరపీ ఇవ్వాలంతే.

హెపటైటిస్ బి – ప్రాణాంతకమైన వ్యాధి. కలుషిత రక్తం ద్వారానూ, ఇంజెక్షన్ సూదుల ద్వారా, శారీరక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి వచ్చాక నివారణ ఉండదు. ఉపశాంతిగా మందులు వాడగలం. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేసుకోవాలి. ఇంకా హెపటైటిస్ సి,డి,ఇ అనేవి కూడా ప్రమాదకరమైన వ్యాధులే .

కామెర్లకి ఇన్ని రకాల కారణాలుండగా అవేమీ తెలుసుకోకుండా ఒళ్లు పచ్చబడగానే, నాటుమందులనీ, వాతలేయించుకోవడమనీ, పత్యాలనీ రోగిని నానా హైరానా పెట్టేస్తూ ఉంటారు.

కొన్ని ప్రాంతాలలో నానా విధాలైన ఆకుపసర్లు మింగించడంతో పాటు, విరేచనాలకి ఆముదం తాగించడం, మణికట్టుమీద ఒక ఇనప రింగుతో కాల్చి వాతలు పెట్టి దానిమీద ఏదో గుడ్డవేసి,

ఆపైన నూనె పోసి, పప్పు పదార్థాలవీ పెట్టి, ఆ గాయం చీము పడితే ఆ చీము ద్వారా లోపలున్న కామెర్ల వ్యాథి బయటకు పోతుందని భావిస్తారు.

ఇదంతా చాలా అనాగరికమైన, ప్రమాదకరమైన వ్యవహారం. అసలే కాలేయం బలహీనంగా ఉండి జీర్ణశక్తీ,

వ్యాధి నిరోధక శక్తీ తక్కువగా ఉండటం వలన అనేక కాంప్లికేషన్ల బారిన పడే ప్రమాదం వుంది. పైగా ఈ వాతల వలన ధనుర్వాతం కూడా రావచ్చు.

కామెర్లు వచ్చి తగ్గిన చాలా కాలం వరకూ స్త్రీ పత్యం అనే పేరుతో దాంపత్య జీవితానికి దూరంగా వుంచుతారు.

హెపటైటిస్ ఏ, బీ కామెర్లు ముఖ్యంగా బీ రకం కామెర్లు దాంపత్య సంబంధాల వలన ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి కాబట్టి,

జీవిత భాగస్వామి రక్తంలో ఆ సూక్ష్మజీవులు అప్పటికే ప్రవేశించాయో లేదో పరీక్షించి, ఆ సూక్ష్మజీవులు రక్తంలో లేకపోతే టీకాలు ఇచ్చి జబ్బువచ్చిన రోగి జీవిత భాగస్వామినీ,

ఇంట్లో ఉండే వారందరినీ వ్యాధి సోకకుండా కాపాడవచ్చు. ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే హెపటైటిస్ బి టీకాలు వేసి జీవితకాల రక్షణ కలిపిస్తున్నారు. ఇది శుభ పరిణామం.

కామెర్లు కనపడగానే భయపడకుండా డాక్టర్ వద్దకు వెళ్లి ఏ రకమైన కామెర్లో నిర్థారించుకుని, సాధారణ రకాలయితే దానికి తగిన తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలూ,

విశ్రాంతీ తీసుకుంటూ, రక్తంలో బిల్ రుబిన్ శాతం తగ్గుముఖం పట్టగానే మామూలు ఆహారం తీసుకుంటూ, సాధారణ జీవితం గడపొచ్చు.

చాలా వ్యాధులకి కారణం కలుషితమైన నీరూ, ఆహారం, అపరిశుభ్రమైన అలవాట్లూ, పరిసరాలూ కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

ఆహారంలో చీము పట్టే వస్తువులుంటాయని చెప్పి దెబ్బలు తగిలిన వాళ్లని, ఆపరేషన్లు జరిగిన వాళ్లని బలవర్థకమయిన ప్రోటీన్లు కలిగి ఉన్న పప్పు పదార్థాలకి దూరంగా ఉంచడం సరికాదు.

ఎవరికి తోచిన పత్యాలు వాళ్లు చేయకుండా డాక్టరు సలహాలు పాటించడం వలన రోగి తొందరగా కోలుకుని వ్యాధి బారినుంచి బయట పడే అవకాశ ముంది.

Recent

- Advertisment -spot_img