Homeక్రైండీప్​ఫేక్​లు క్రియేట్​ చేస్తే భారీ జరిమానా

డీప్​ఫేక్​లు క్రియేట్​ చేస్తే భారీ జరిమానా

– కేంద్రం కీలక నిర్ణయం

ఢిల్లీ, నేషనల్ బ్యూరో: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తొందరలో దీనిపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. డీప్‌ఫేక్‌ వీడియోలను సృష్టించే వారికి, ఆ వీడియోల వ్యాప్తికి కారణమయ్యే సోషల్​ మీడియా సంస్థలకు భారీ జరిమానా విధించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. డీప్‌ఫేక్‌ వీడియోల కట్టడిపై చర్చించేందుకు కేంద్రం గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సోషల్​ మీడియా సంస్థలు, నాస్కామ్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​పై పనిచేసే నిపుణులతో చర్చించింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడారు. మన ప్రజాస్వామ్యానికి డీప్‌ఫేక్‌ సరికొత్త ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘సోషల్​ మీడియా సంస్థలతో జరిగిన సమావేశంలో మేం నాలుగు అంశాలపై కీలకంగా చర్చించాం. డీప్‌ఫేక్‌లను గుర్తించడం, వాటి వ్యాప్తిని అరికట్టడం, వాటిని నివేదించడం, అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చలు జరిపాం. రాబోయే కొన్ని వారాల్లో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నాం. ఆ ముసాయిదా రూపకల్పనను నేటి నుంచే ప్రారంభిస్తాం. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను సవరించడమో.. లేకపోతే కొత్త చట్టం తీసుకురావడమో చేస్తాం’అని కేంద్రమంత్రి వెల్లడించారు. డిసెంబరు తొలి వారంలో దీనిపై మరోసారి చర్చిస్తామన్నారు. ఇటీవల సినీతారలు రష్మిక, కాజోల్‌, కత్రినాకైఫ్‌, సచిన్‌ కుమార్తె సారా సహా పలువురు సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో టెక్నాలజీ దుర్వినియోగంపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. అటు ప్రధాని మోడీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. డీప్‌ఫేక్‌లు సమస్యాత్మకంగా మారుతున్నాయని అన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఈ నేపథ్యంలోనే చర్యలకు సిద్ధమైన కేంద్రం గురువారం సోషల్ మీడియా సంస్థలతో సమావేశమైంది.

Recent

- Advertisment -spot_img