– దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నది తెలంగాణలోనే
– బీఆర్ఎస్ సర్కారుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు
ఇదే నిజం, హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. కేంద్రప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి తరఫున మధురానగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ‘బంగారు తెలంగాణను ఇవాళ అప్పుల పాలు చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్న పరిశ్రమలు చూపిస్తున్నారు తప్ప ఇతర జిల్లాల్లో అభివృద్ధి జరగలేదు’అని నిర్మల ఆరోపించారు.