ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రానున్న మంత్రివర్గ విస్తరణలో తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీమాగా ఉన్నారు. అంతేకాక తనకు చోటు దక్కకపోతే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు చేసేందుకు కూడా ఆయన రెడీ అవుతున్నారు. మంత్రి మండలిలో జాయిన్ అవ్వడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ప్రేమ్ సాగర్ రావు వాదన. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని నిలబెట్టానని ఆయన చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సపోర్ట్ కూడా ప్రేమ్ సాగర్ రావుకు ఉంది. అయితే ఈ అంశమే ఆయనకు మైనస్ గా కూడా మారబోతున్నట్టు కనిపిస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మరో ఆరుగురుని కేబినెట్ లో చేర్చుకొనే చాన్స్ ఉంది. దీంతో సీనియర్ నేతనైన తనకు కచ్చితంగా చోటు దక్కుతుందని ప్రేమ్ సాగర్ రావు భావిస్తున్నారు. ఇప్పటికే వెలమ సామాజివర్గానికి చెందిన జూపల్లికి కేబినెట్ లో చోటు దక్కింది. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావుకు చోటు దక్కుతుందా? అన్నది వేచి చూడాలి.
జిల్లాలో మినిస్ట్రీ కోసం పోటీపడుతున్నదెవరు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 4, బీజేపీ 4, బీఆర్ఎస్ రెండు చోట్ల విజయం సాధించింది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే బెల్లంపల్లి, చెన్నూరు అభ్యర్థులు వివేక్, వినోద్ కుటుంబానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు టికెట్లు దక్కాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో వివేక్ కుమారుడికి పెద్దపల్లి టికెట్ వచ్చింది. కాబట్టి వారికి మంత్రి మండలిలో చోటు ఉండే చాన్స్ లేదు. ఇక ఖానాపూర్ నుంచి గెలిచిన వెడ్మ బొజ్జుకు గిరిజన కోటాలో మంత్రివర్గం నుంచి అవకాశం దక్కాలి. కానీ ఇప్పటికే గిరిజన కోటా కింద సీతక్కకు మినిస్ట్రీ దక్కింది కాబట్టి.. తనకే ఎక్కువగా అవకాశం ఉంటుందని కొక్కిరాల భావిస్తున్నారు.
తిరుగుబాటు మొదలుపెడతారా?
ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అంతా తానై వ్యవహరించారు. ఆయన పాద యాత్ర సక్సెస్ అవ్వడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి మంత్రి పదవి ఇస్తుందని భావించారు. ఇక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, మరో కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాయంలోనూ ప్రేమ్ సాగర్ రావు ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే భట్టికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ఉందన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేమ్ సాగర్ రావుకు రాబోయే మంత్రి మండలిలో స్థానం కల్పించకపోతే ఆయన తిరుగుబాటు చేసే చాన్స్ ఉంది. ఆర్థికంగా ఎంతో బలమైన నేత, ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో గట్టి పట్టు ఉన్న లీడర్. పైగా భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వంటి మంత్రుల సపోర్ట్ ఉంది. తాను మంత్రి పదవికి అన్ని విధాల అర్హుడనని కొక్కిరాల భావిస్తున్నారు. మరి రేవంత్ లేదా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి.