న్యూఢిల్లీః ఇండియా, చైనా బార్డర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా ఆర్మీ వేసే జిమ్మిక్కులకు ఇండియాన్ ఆర్మీ ధీటుగా జవాబిస్తోంది. చైనా ఆర్మీ కదలికలను ముందుగానే పసిగట్టి ముందుగానే స్పందించి కీలకమైన పర్వతాలపై పోస్టులను ఏర్పాటు చేస్తోంది. చుషూల్ సెక్టార్లో కీలకమైన ఆరు పర్వతాలపై ఇండియన్ ఆర్మీ పట్టు సాధించడంతో చైనా ఆర్మీ నిరాశ, నిస్పృహల్లో ఉంది. మగర్ హిల్, గురుంగ్ హిల్, రిసెహెన్ లా, రెజంగ్ లా, మొఖ్పారీ, ఫింగర్ 4 సమీపంలో ఎత్తయిన ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ పాగా వేసింది. ఇక్కడి నుంచి చైనా ఆర్మీ వేసే ప్రతి అడుగు ఇండియన్ ఆర్మీ పరిశీలించే అవకాశం కలుగనుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. హిమాలయాల్లో కఠినమైన శీతల పవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో చైనాతో కోర్ కమాండర్ స్థాయి చర్చలు మొదలయ్యాయి. వీటిల్లో సైనిక అధికారులతోపాటు విదేశాంగశాఖ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఇరు దేశాలు చర్చలను సానుకూల వాతావరణంలో ముగించాలని ఆలోచన చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. మరోపక్క ఇండియన్ ఎయిర్ఫోర్స్ అమ్ముల పొదిలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు లద్ధాఖ్ భౌగోళిక పరిస్థితులను అలవాటు చేసుకొనేందుకు అంబాలా స్థావరం నుంచి డైలీ వెళ్లి చక్కర్లు కొడుతుండటం చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.