Homeహైదరాబాద్latest Newsసల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపింది మేమే : Crime Updates

సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపింది మేమే : Crime Updates

– గ్యాంగ్​స్టర్ బిష్ణోయ్​ సోదరుడు అన్మోల్ పేరుతో సోషల్​ మీడియాలో పోస్టు వైరల్
– దర్యాప్తులో స్పీడ్ పెంచిన పోలీసులు
– సల్మాన్ ఇంటి దగ్గర పోలీస్​ వెహికల్మి స్సింగ్ అయినట్లు గుర్తింపు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆయన ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు ఆదివారం తెల్లవారుజామన బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా.. కాల్పులకు సంబంధించి కీలక విషయాలు బయటికొస్తున్నాయి. ఇది గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా పనేనని తెలుస్తోంది. సాధారణంగా సల్మాన్‌ ఇంటి ముందు ఎప్పుడూ ఓ పోలీసు వాహనం నిలిపి ఉంటుంది. ఆదివారం ఉదయం కాల్పులు జరిగిన వేళ ఆ వాహనం అక్కడ లేదని దర్యాప్తులో తేలింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తుండగా.. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు కూడా ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

కి.మీ దూరంలో బైక్​ స్వాధీనం..

కాల్పుల తర్వాత ఘటనా స్థలంలో ఐదు ఖాళీ షెల్స్‌, ఒక లైవ్‌ బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ ఖాళీ షెల్‌ను సల్మాన్‌ ఇంటి బాల్కనీలో గుర్తించారు. ఘటన సమయంలో నటుడు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కాల్పుల తర్వాత నిందితులు బాంద్రా వదిలి పారిపోయినట్లు సమాచారం. నిందితులు ఉపయోగించిన బైక్‌ను సల్మాన్‌ ఇంటికి కిలోమీటరు దూరంలో స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి వారు ఆటో రిక్షాలో పరారైనట్లు గుర్తించారు. దుండగులను గాలించేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు నిందితులు ఉపయోగించిన బైక్‌ను దొంగలించడం లేదా సెకండ్‌ హ్యాండ్‌లో కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఒక అనుమానితుడిని గురుగ్రామ్‌కు చెందిన విశాల్‌ రాహుల్‌గా గుర్తించారు. ఇతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ రోహిత్‌ గోదరా దగ్గర షూటర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పలు హత్య, దొంగతనాల కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. రోహిత్‌ కూడా విదేశాలకు పారిపోయాడు. అక్కడి నుంచే తన నేర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.

ఇది ట్రైలర్‌ మాత్రమే..

కాల్పుల అనంతరం గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ పేరుతో ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ‘సల్మాన్‌ ఖాన్‌.. నీకు ట్రైలర్‌ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే నీకు చివరి వార్నింగ్‌’ అని ఆ పోస్టులో హెచ్చరించినట్లుగా ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్మోల్‌పై 18 క్రిమినల్‌ కేసులున్నాయి. 2021 అక్టోబర్​లో జోధ్‌పూర్‌ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు సమాచారం. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ వాంటెడ్‌ నిందితుడిగా ఉన్నాడు. సల్మాన్‌ ఖాన్‌పై బిష్ణోయ్‌ గ్యాంగ్‌ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. గతేడాది మార్చిలో అతడిని బెదిరిస్తూ పంపిన ఓ ఈ – మెయిల్‌ తీవ్ర కలకలం రేపింది. దీని తర్వాత సల్మాన్‌ భద్రతను వై ప్లస్‌ కేటగిరీకి పెంచారు.

Recent

- Advertisment -spot_img