తెలంగాణాలో చాపకింద నీరుగా మాదక ద్రవ్యాల సరఫరా విస్తరిస్తోంది. స్మగ్లర్లు పోలీసుల కంటపడకుండా.. రకరకాల పద్దతుల్లో గంజాయిని విక్రయిస్తున్నారు. తాజాగా.. ఓ మహిళ కిరాణ దుకాణం ముసుగులో గంజాయిని విక్రయిస్తోంది. చాక్లెట్ల రూపంలో గంజాయిని అమ్ముతూ పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ శివారు జగద్గిరిగుట్టలో బీహార్ కు చెందిన సునీతా దేవి అనే మహిళ బీహార్లోని తన సొంత గ్రామం నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తోంది. ఒక్కో గంజాయి చాక్లెట్ను రూ.1కి కొనుగోలు చేసి.. ట్రైన్లు, బస్సుల్లో ఇక్కడకు తీసుకొస్తుంది. స్థానికంగా ఉండే యువత, కార్మికులకు ఒక్కో చాక్లెట్ను రూ.20 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. బాలానగర్ ఎస్వోటీ టీం, జగద్గిరిగుట్ట పోలీసులు దాడులు నిర్వహించి 9.3 కేజీల గంజాయి చాక్లెట్లను ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.