కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువై పోతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్దారు.
అలాంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదన్నారు. పీసీసీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు జానారెడ్డి.
గ్రూపులతో పార్టీ బలహీన పడుతుందన్నారు. పార్టీని బలహీనపరిచే వారిపై పీసీసీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి ఫిర్యాదు చేస్తానన్నారు.
పార్టీలో సీనియర్ల నుంచి చిన్న నాయకుల వరకు అందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్టీలో ఎవరికి వారు బాధపడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
ఎవరు అవమానం చేసినా.. అపహస్యం చేసిన ఆ నష్టం పార్టీకే అన్నారు.
ఏ నాయకుడ్ని అయినా అభిమానిస్తే… కార్యకర్తలు క్రమశిక్షణతో ఆయనకు తమ మద్దతు ఇవ్వాలన్నారు.
అంతేకాని పార్టీకి చెందిన ఇతర నాయకుల్ని విమర్శించకూడదన్నారు. అలాంటి చర్యలు వల్ల ఘర్షణ వాతావరణం,
మనస్పర్థలు ఏర్పడతాయన్నారు. ఇలాంటి చర్యలు పార్టీకి, నాయకత్వానికి సరైనవి కాదని జానారెడ్డి హెచ్చరించారు.
కార్యకర్తలు అభిమానించే నాయకుడు కూడా తన వెంట ఉన్నవారిని కట్టడి చేయాలన్నారు.
అలా చేయకుంటే ఆ నాయకుడికి, ఆయన వెంటున్న వారికి కూడా నష్టం తప్పదన్నారు జానారెడ్డి.
గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి పార్టీ నేతల మధ్య ఏమైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు.
పార్టీలోని నేతలు పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఒక నాయకుడిని గౌరవిస్తూ మరో నాయకుడిని అవమానపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆయన స్పందించారు.
ఈ రకమైన పోస్టుల వల్ల తమను అభిమానించే నాయకుడికే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద కాంగ్రెస్లో గ్రూపు తగాదాలున్నాయని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీపీసీసీలో హాట్ టాపిక్గా మారాయి.
అయితే రేవంత్ అభిమానులకే జానారెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని సొంత పార్టీ నేతలతో పాటు.. ఇతర పార్టీల నేతలు సైతం చర్చించుకుంటున్నారు.