– సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఫైబర్నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోరారు. దీంతో అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.