ఆయన వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు. దశాబ్దకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అధికారాన్ని అనుభవించిన వ్యక్తి. దర్జాగా తిరుగుతూ ఎదురేలేని వ్యక్తిగా చలామణి అయిన ఘనుడు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు అంత స్వేచ్చనిచ్చింది. అవకాశాలు కల్పించింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చి తగిన గౌరవం ఇచ్చింది. రాజకీయంగా ఎదిగేందుకు ఎంతగానో సహకరించింది. ఇంతలా కన్నతల్లిలా చూసుకున్న పార్టీనే నట్టేట ముంచే దుర్మార్గనికి తెరతీసాడు. బీఆర్ఎస్ ను బొందపెట్టాలన్న నాయకుడితో చేతులు కలిపి తన వక్రబుద్ధిని నిరూపించుకున్నాడు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే అలిగినవాళ్లను చూసాం. రాజీనామా చేసి వేరే పార్టీలో చేరినవాళ్లని చూసాం. కానీ ఈయన చేసిన ఘనకార్యమేమిటంటే పార్టీ టెకెట్ చేతికొచ్చిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్కపెటినట్లు సొంత పార్టీని, నాయకులను, కార్యకర్తలను, చివరికి ప్రజలను కూడా మోసం చేసి కాంగ్రెస్ గూటికి చేరి నీచకార్యానికి ఒడిగట్టారు. ఎన్నో విమర్శలకు కేంద్రబిందువుగా తయారయ్యారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ఈయన వ్యవహారశైలిని చూసి బీఆర్ఎస్లోని యువత ఆవేశం కట్టలుతెంచుకుంటోంది. నమ్మకద్రోహం చేసిన వ్యక్తి అని వాళ్ల దృష్టిలో ముద్ర పడింది. గత కొన్నాళ్లుగా ఆయన వ్యవహార శైలిని దగ్గరగా చూసిన వాళ్లంటోన్న మాటల్ని చూస్తే..
పొయేటోడు పోక ఇన్నాళ్లు ఆగి తీర సమయానికి పోవాల్సిన అవసరం ఏముంది. ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డితో చేతులు కలపాల్సిన అవసరం ఏముంది. పదేళ్లు అధికారాన్ని అనుభవించి దర్జాగా బతికిన వ్యక్తి..తీరా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని తిట్టి వెళ్లాడు. పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, పరిస్థితులు బాగాలేవని నిందలు వేసేముందు ఆ పార్టీని నడిపిన వారెవరో తెలియదా. సిగ్గు, ఎగ్గు లేకుండా 70 ఏళ్ల వయసులో జంప్ చేయాల్సిన తరుణమా ఇది. యువతకు ఆయన ఏ విధంగా ఆదర్శంగా ఉంటారో అర్ధమవుతుంది. రాజకీయ అనుభవం లేని వ్యక్తులు స్వార్థం కోసం పార్టీ మారారంటే ఓ అర్థం ఉంటుంది. దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో..ఆయన రాజకీయ జీవితంలో ఎంతోమందిని తొక్కారు. ఎదగనీయకుండా అడ్డుపడ్డారు. ఇష్టారీతిన వ్యవహరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోన్న పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారం, విద్యుత్, కాళేశ్వరం దందా తదితర కేసులన్నీ తన మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనన్న భయంతో ముందుగానే సదురుకున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రేవంత్ రెడ్డి గారూ..మీరు మరో పదేళ్లు సీఎంగా ఉండాలన్న వ్యాఖ్యల వెనుక ఇంత అర్థం ఉందని ఎవరూ గ్రహించలేకపోయారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నాయకులు అందరూ సైలెంట్గా ఉంటే కడియం శ్రీహరి మాత్రం స్టేషన్ ఘన్పూర్ విజయోత్సవ ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేం. మూడ్నెళ్లా..ఆర్నెళ్లా..అని నేను చెప్పనుగానీ’అని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కానీ అవి విషపు పలుకులని, ద్వంద్వార్థాలనిచ్చే మాటలని బీఆర్ఎస్ నాయకులకు కొంచెం లేట్గా బోధపడింది. ఫర్ వేరియస్ రీజన్స్..పార్టీ ఈజ్ లూసింగ్ ద క్యాడర్, ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ గోయింగ్ డౌన్ అంటూ మీడియాతో చెప్పి సైలెంట్గా తన కోసం, తన కూతురి కోసం జంప్ చేశారు. ఇలా గత కొన్నాళ్లుగా పార్టీలోనే ఉంటూ కుంపటి పెట్టారన్నది చేదు నిజం. నిజానికి ప్రజాసేవ చేయాలనుకున్న వ్యక్తి ప్రతిపక్షంలో ఉంటేనే ఎక్కువ పని చేయగల్గుతాడు. ఇంతటి మోసాన్ని తట్టుకొని మనోధైర్యం కోల్పోకుండా పార్టీ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ నిలబడ్డారంటే నిజంగా వాళ్ల గొప్పతనం. ముసలివాళ్లు పోతేపోనీ పార్టీకి , రాష్ట్రానికి సేవలందించే ఒక కొత్తతరం నాయకత్వాన్ని తయారుచేస్తామని ఛాలెంజ్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ యువరక్తంతో జెట్స్పీడ్లో దూసుకెళ్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే దేశాభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతోన్న జంపింగ్ల వ్యవహారాన్ని చూసి ఒకరకంగా రాజకీయ నాయకులు ఎంతటి నీచానికైనా ఒడుగడుతారని స్పష్టంగా అర్థమవుతోంది.