బెంగళూరుః ప్రమోషన్ల కోసం ఉద్యోగులు, పదవుల కోసం రాజకీయ నేతలు ఆశపడటం సహజం. కానీ తనకు ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టు వరించేలా ఆశీర్వదించమని దుర్గమ్మని వేడుకుంటూ లేఖ రాయడం, అది ఆమె పాదాల చెంత ఉంచి కర్ణాటక ఆరోగ్య మంత్రి బి శ్రీరాములు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కర్ణాటకలోని కలబుర్గిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి ముందు యాద్గిరి జిల్లా షాహాపూర్ తాలూకా గోనల్ గ్రామంలోని దుర్గాదేవి ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి శ్రీరాములు ఏ పనిచేపట్టినా ఆ ఆలయంలో పూజలు నిర్వహించడం సెంటిమెంట్గా వస్తోందని, ఆ గుడికి వెళ్లి దుర్గాదేవికి పూజలు చేసి.. ఆమె పాదాల చెంత తన కోరికలు రాసిన లేఖ ఉంచుతారని, ఆ కోరికలన్నింటినీ ఆ గుడిలో దేవత నెరవేర్చిందని శ్రీరాములు కుటుంబ సభ్యులు, అనుచరుల ప్రగాఢ విశ్వాసం. క్యాబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతుండగా.. డిప్యూటీ సీఎం పదవిని శ్రీరాములు ఆశిస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.