హైదరాబాద్ః మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు నిరూపమానమని, తెలంగాణ ఖ్యాతిని పెంచిన పీవీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో బుధవారం పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమాలోచన సభ కార్యక్రమంలో ఆమే పాల్గొని పీవీ సేవలను కొనియాడారు. ఇండియా ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. పీవీ సేవలను యువతరానికి తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జాగృతి నాయకులకు కవిత పిలుపునిచ్చారు. ఇందులో పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, రచయిత కల్లూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.