తిరువనంతపురం: కరోనా లాక్ డౌన్ కారణంగా 7 నెలలపాటు మూసివేసిన అయ్యప్ప ఆలయం ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది.
మండల, మకర విళక్కు పూజల కోసం రెండు నెలల పాటు తెరచిన విషయం తెలిసిందే.
శబరిమల తీర్థయాత్రకు అనుమతి ఇచ్చిన తర్వాత భక్తులు దర్శనానికి సంబంధించి కఠిన నిబంధనలు విధించింది ట్రావెన్కోర్ దేవస్థానం.
వారాంతాల్లో ౩ వేల మందికి , మిగతారోజులలో 2 వేలమంది భక్తులకు కేరళ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
ప్రస్తుతం ఒక రోజుకు 1000 మంది భక్తులను అనుమతిస్తున్న దేవస్థానం ఇక నుండి 2000 వరకు భక్తులను అనుమతించనుంది.
ఇక వారాంతపు సెలవు దినాలలో 2000 నుంచి 3000 వరకు భక్తుల సంఖ్య పెంచినట్లుగా తెలుస్తుంది.
ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) విజ్ఞప్తి మేరకు ప్రధాన కార్యదర్శి విశ్వస్ మెహతా అధ్యక్షతన తీర్థయాత్రల కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేరళ రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న కేసులను పేర్కొంటూ భక్తుల సంఖ్య పెంచడంపై ఆరోగ్య శాఖ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.
అయినప్పటికీ తాజా ఆర్థిక కష్టాల దృష్ట్యా భక్తుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భక్తులు పంపా, సన్నిధానం మధ్య వేర్వేరు ప్రదేశాలలో ఉంటారు కాబట్టి భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ పెద్దగా రద్దీ ఉండదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరోనా వ్యాప్తి నివారణకు ఔషధ తాగునీటి పంపిణీ
యాత్రికుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం కరోనా వ్యాప్తిని నివారించడం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఔషధ తాగునీటిని పంపిణీ చేసే వ్యవస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే .
అయ్యప్ప ఆలయంలో యాత్రికులకు కోవిడ్ సమయంలో అనారోగ్యం దరిచేరకుండా ఔషధయుక్తమైన తాగునీటిని అందిస్తుంది.
బేస్ క్యాంప్ అయిన పంబాలో ఆంజనేయ ఆడిటోరియం వద్ద ఈ ఔషధ తాగునీటిని అందుబాటులో ఉంచారు.
నడక మార్గంలో పంబా, చరల్మెడు, జ్యోతినగర్, మాలికపురం వంటి వివిధ ప్రదేశాలలో కూడా పేపర్ గ్లాస్లో ఔషధయుతమైన త్రాగు నీరు పంపిణీ చేయబడుతుందని, కోవిడ్ -19 ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నీటిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.