హైదరాబాద్: ఓట్ల కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ స్వార్థ రాజకీయాలు చేస్తోందని టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టారని.. జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని చెప్పారని.. ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోనైనా పడ్డాయా అని నిలదీశారు.
కరోనా నేపథ్యంలో ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని.. మరి ఆ ప్యాకేజీ ద్వారా ఎవరికైనా ఒక్క రూపాయి లబ్ధి జరిగిందా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా భాజపా, ఎంఐఎం నేతల వ్యవహార శైలిపై కేటీఆర్ మండిపడ్డారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్స్ అంటే.. మరొక్కరు సమాధులు కూలుస్తామంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, ఎల్ఐసీని అమ్మేశారని అన్నారు. మత విద్వేషాలు సృష్టించి పిల్లల భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు రావడం కాదు.. ఉన్న ఉద్యోగాలు పోయాయని విమర్శించారు.
ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలి
రాష్ట్రంలో ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుందో ప్రజలే ఆలోచించాలన్నారు. హైదరాబాద్కు టీఆర్ ఎస్ ఎంతో చేసిందని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని కేటీఆర్ వివరించారు.
కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ఎవరు ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు.
ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నారు. అన్ని వర్గాలతో పాటు ఆర్యవైశ్యులను కూడా ఆదరించినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని.. ఆయన నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇతరత్రా ఎలాంటి సమస్యలున్నా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు.