- 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన
- ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా ప్రఖ్యాతి
- భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం
- ఆధునిక దేవాలయంగా అభివర్ణించిన నెహ్రూ
ఇదే నిజం, నాగార్జునసాగర్ : కోట్లాది మంది గొంతు తడుపుతూ, కడుపు నింపుతూ…ప్రతీ ఇంట విద్యుత్ కాంతులు వెదజల్లుతూ….బీడు భూములకు జీవం పోసి బంగారు భూములుగా మారుస్తూ…నవ నాగరికతకు నిలయమై, ఆధునిక ఆలయమై విలసిల్లుతోంది మన బహుళార్థకసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్. ప్రపంచంలోనే మానవ నిర్మిత మహాద్భుతంగా, భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా పేరొందిన సాగర్ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసి సరిగ్గా నేటికి 68 వసంతాలు పూర్తిచేసుకుని 69వ వసంతంలోకి అడుగుతోంది. 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ డ్యాంపై ప్రత్యేక కథనం.
భారత ఇంజనీర్ల స్వయం సాంకేతిక పరిజ్ఞానానికి, కృష్ణానదిపై నిర్మించబడిన తొలి జాతీయ ప్రాజెక్టు. ప్రతిభ, మేధాసంపత్తికి నిదర్శనంగా, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1955 డిసెంబరు 10న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నవభారత నిర్మాత, భారత తొలిప్రధాని పండిట్ జనహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేసిన సందర్భంలో ‘ఆధునిక దేవాలయంగా’ నాగార్జున సాగర్ను అభివర్ణించారు. ధాన్యాగారంగా విరాజిల్లి, ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, గ్రామీణ ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి తోడ్పడిరది. వ్యవసాయాభివృద్ధికి, దాని ద్వారా గ్రామీణ చైతన్యానికి సాగర్ జలాశయంతో బీజం పడిరది.
చారిత్రీక ప్రాంతంలో:
నాగార్జున కొండ ప్రాంతంలో ఒకనాడు నెలకొన్న విజయపురి పట్టణం జలాశయంలో అంతర్భాగమైనప్పటికీ నేడు చారిత్రీక, ఆధ్యాత్మిక, వ్యవసాయం, పారిశ్రామిక కేంద్రంగా ఉపయోగపడుతోంది. కరుణా సముద్రుడైన బుద్ధభగవానుని సందేశం విశ్వవ్యాప్తం కావటానికి ఈ ప్రాంతం దోహదపడితే, జలాశయం నిర్మాణం తర్వాత అన్ని రంగాలలోనూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని సుఖసంతోషాలమయం చేయటం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల వీలయ్యింది.
ఆనాటి ఆలోచన:
1900 సంవత్సరం నుంచి కృష్ణానదిపై జలాశయాలు కట్టాలనే ఆలోచన నాటి బ్రిటిష్ పాలకులకు కలిగింది. కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకోవాలని తొలి నుంచి జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముక్త్యాల రాజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకలి చావులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలని స్వాతంత్య్రం సిద్ధించాక నవభారత నిర్మాత, తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు నిర్ణయించారు. ఇందుకోసం సాగునీటి వసతులు కల్పించాలని భావించటంతో అందుకు తగిన విధంగా తొలి పంచవర్ష ప్రణాళిక నుంచే సాగునీటి పథకాలు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే దక్షిణాదిన నాగార్జునసాగర్ కు శ్రీకారం చుట్టారు.
1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించాక:
1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించాక సాగర్ నిర్మించేందుకుగాను అధ్యయనం చేసేందుకు ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, డీవీ రావుల ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. రెండేళ్ల తర్వాత 1955లో నాటి ప్రధాని నెహ్రు శంఖుస్థాపన చేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, సొంతగా ప్రణాళికా పెట్టుబడులు, కనీస యంత్రాల వినియోగంతో పూర్తి స్థాయిలో మానవ నిర్మిత జలాశయంగా 1956 ఫిబ్రవరిలో పనులు మొదలయ్యాయి. నాటి ఈ ప్రాజెక్టు నిర్మాణం నేటి జలయజ్ఞానికి స్ఫూర్తిగా ఉంటుందనటంలో సందేహంలేదు. ప్రధానంగా జలాశయం నిర్మాణ పనుల్లో రోజుకు కనీసం 50వేల మంది కార్మికులు పాలుపంచుకునే వారంటే ఎంత ఉదృతంగా పనులు జరిగాయో అంచనా వేసుకోవచ్చు. పూర్తిగా రాతికట్టగా పనులు ప్రారంభించారు. 1969లో జలాశయం పనులు పూర్తి చేశారు. 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సాగర్ కాలువలకు నీటిని విడుదలచేశారు. 1974లో జలాశయానికి గేట్లు అమర్చటంతో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయటం అప్పటి నుంచి సాధ్యం అయ్యింది. 108 శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో 124.66 మీటర్ల ఎత్తు, 97.5 మీటర్ల వెడల్పుతో 26 క్రస్ట్ గేట్లు కలిగిన అతిపెద్ద మట్టి, రాతికట్ట జలాశయంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.
లక్షల ఎకరాలకు నీరందిస్తోంది
నాగార్జున సాగర్ వల్ల నేడు 22 లక్షల ఎకరాలకు నీరందుతోంది. విద్యుత్ వెలుగులను అందిస్తున్నది. కోటి గొంతుకలను తడుపుతున్నది ఈ యొక్క బహుళార్థ సాధక ప్రాజెక్టు. ప్రాజెక్టును బృందావనంగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం. ప్రాజెక్టును చూడటానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు, వారికి తగు సమాచారం కల్పించే విధంగా ప్రాజెక్టు యంత్రాంగం, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రాజెక్టు భవిష్యత్తులో పటిష్టంగా ఉండటానికి చర్యలు చేపట్టాలి.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలు
రాతి కట్టడం పొడవు : 4756 అడుగులు
రాతి కట్టడం ఎత్తు: 409 అడుగులు
మొత్తం జలాశయం పొడవు:1545 అడుగులు
స్పిల్ వే:1545 అడుగుల పొడవు
26 క్రస్ట్ గేట్లు(ఒక్కొక్కటి45 I 44 అడుగులు)
డ్యాం పూర్తిస్థాయి నీటి నిలువ ఎత్తు: 590 అడుగులు
స్థూలంగా నీటి నిల్వ: 408.24 టీఎంసీలు
కనీస నీటి విడుదల మట్టం: 510 అడుగులు