ఏపీ నిర్మిస్తున్న సీమ ఎత్తిపోతల పథకం విషయంలో అటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, ఇటు కేఆర్ఎంబీ వ్యవహరిస్తున్న తీరుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అసహనం వ్యక్తంచేసింది.
ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా? అంటూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసింది.
సీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్లో సోమవారం విచారణ కొనసాగింది.
ప్రాజెక్టును ఇటీవల క్షేత్రస్థాయిలో సందర్శించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నివేదికను రూపొందించింది. అయితే ఆ నివేదిక ట్రిబ్యునల్కు చేరలేదు.
కేఆర్ఎంబీ రూపొందించిన నివేదికలోని ఫొటోలను తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది.
ఎన్జీటీ నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను చేసిందని, తగిన చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ను కోరింది.
అదేవిధంగా ఏపీ చీఫ్ సెక్రటరీ కోర్టుకు అబద్దాలు చెబుతున్నారని పిటిషనర్ శ్రీనివాస్ తరపు న్యాయవాది ట్రిబ్యునల్కు వివరించారు.
ఈ సందర్భంగా ఎన్జీటీ మొదటగా కేంద్ర పర్యావరణశాఖపై మండిపడింది.
సీమ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులున్నాయా? లేవా? అనే దానిపై నివేదిక సమర్పించాలని గత జూన్లోనే ఆదేశాలు జారీచేసినా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇప్పటికీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
జూన్లో ఆదేశాలు ఇస్తే ఇప్పటివరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని నిలదీసింది.
ఏపీ సర్కారుతో ఏమైనా కుమ్మక్కయ్యారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఆ తర్వాత ఏపీ సర్కారుపై ట్రిబ్యునల్ నిప్పులు చెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం అందజేసిన ఫొటోలను పరిశీలిస్తే ప్రాజెక్టు పనులు ఎక్కువగానే జరిగినట్టు తెలుస్తున్నదని, కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నది.
అదే నిజమైతే అధికారులను జైలుకు పంపవచ్చా? ఆ అధికారం ట్రిబ్యునల్కు ఉందా? లేదంటే హైకోర్టు ద్వారా పంపాల్సి ఉంటుందా? అని ఏపీ అడ్వకేట్ను ప్రశ్నించింది.
దీనిపై న్యాయసలహాలు ఇవ్వాలని పిటిషన్ తరపు న్యాయవాదితోపాటు, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని ట్రిబ్యునల్ కోరింది.
కేఆర్ఎంబీ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించాక ఉత్వర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 27 తేదీకి ఎన్జీటీ వాయిదా వేసింది.
ఆలోగా నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని కేంద్ర పర్యావరణశాఖకు, కేఆర్ఎంబీకి ఆదేశాలను జారీచేసింది.