హైదరాబాద్ః ఇకపై 5 నిమిషాల్లో భూ బదలాయింపు ప్రక్రియతోపాటు మ్యూటేషన్ను వెంటనే చేసి డాక్యుమెంట్, పాస్బుక్, ధరణి కాపీలను వెంటనే అందజేసేలా కొత్త రెవెన్యూ చట్టంలో సంస్కరణలు తెచ్చినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ను ఉదాహరణగా తీసుకుని నూతన బిల్లులోని భూ రిజిస్ట్రేషన్ విధానాన్ని సోదాహరణంగా వివరించారు.
స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను తహసీల్దార్లకు కూడా అప్పగించారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ని స్వయంగా కాని ఆన్లైన్లో గాని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. భూమిని అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తి అడగగానే స్లాట్ అలాట్ చేయాల్సిందేనని నిబంధనలు రూపొందించారు. తహసీల్దార్లు సైతం తన ఇష్టం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా, దయ కలిగినప్పుడు చేస్తా అంటే నడవదని స్లాట్ బుకింగ్ ప్రకారం వెంటనే అన్ని జరిగిపోవాలని సీఎం సభలో వివరించారు. ఇంకా ఏమన్నారంటే.. స్లాట్ అలాట్ చేసింది విధిగా వెబ్సైట్లో పెట్టాలి. పలాన వ్యక్తులు వస్తున్నరని వారికి స్లాట్ అలాట్ అయి ఉన్నదని లాగ్ రిజిస్టర్లో కూడా నమోదు చేయాలి. ప్రతీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, ప్రతీ ఎమ్మార్వో ఆఫీసులో కూడా లాగ్ బుక్స్ ఉంటయి. అదేవిధంగా హార్డ్ కాపీ కూడా మెయింటెన్ అవుతదన్నారు. డాక్యుమెంట్ రైటర్ అవసరం లేదనుకునేవారు వారే సొంతంగా రాసుకోవచ్చు. అందుకు టెంప్లేట్స్(నమూనా పత్రాలు) ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. రాసుకోలేము అనుకునేవారి గవర్నమెంట్ డాక్యుమెంట్ రైటర్ను సంప్రదించి రాతకోతలు పూర్తిచేసుకోవాలి. కేటాయించిన స్లాట్ టైంలో భూమి అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి ఇరువురు పాస్బుక్లు తీసుకుని ఆఫీసుకు పోతరు. సమర్పించి పత్రాలకు ఎలిజిబులిటి ఉందా లేదా అని చెక్ చేస్తాడు. అర్హత ఉంది అంటే రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని (చాలానా రూపంలో లేదా డ్రాఫ్ట్ రూపంలో లేదా క్యాష్ రూపంలో) వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తరు.
వెంటనే మ్యూటేషన్
అప్పుడే, అక్కడే అమ్మిన వ్యక్తి పాస్బుక్లోంచి ఎంత భూమి అయితే అమ్మిండో దాన్ని డెలిట్ చేసి కొన్న వ్యక్తి పాస్బుక్లోకి ఎంటర్ చేస్తారు. మ్యూటేషన్ పవర్ కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు ఇస్తున్న నేపథ్యంలో మ్యూటేషన్ కూడా వెంటనే అవుతది. మ్యూటేషన్ చేయడమే కాకుండా అక్కడే ఐటీ టేబుల్ రెడీగా ఉంటది. వాళ్లకు డాక్యుమెంట్ ఇవ్వాలి. ఒక్కటే నిమిషంలో ఐటీ టేబుల్లో ఉండే వ్యక్తి అప్రూవ్ చేసి కాపీ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తడు. మ్యూటేషన్ అయిన ఐదో నిమిషం లోపల భూ మార్పిడి జరిగిందని యావత్ ప్రపంచానికి తెలిసిపోతది. పలనా వారీ భూమి పలనా వాళ్లు కొన్నరని వెబ్సైట్లో వచ్చేస్తుంది. డాక్యుమెంట్, పాస్బుక్, ధరణి కాపీ భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి ఇస్తే అమ్మిన వ్యక్తికి పాస్బుక్తో పాటు ధరణి కాపీని అందజేస్తారన్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్, ఎక్స్ట్రాక్ట్ కాపీ కూడా వెంటనే అక్కడికక్కడే వస్తుందని సీఎం పేర్కొన్నారు.