- అసెంబ్లీలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, రాజగోపాల్రెడ్డి మధ్య మాటల యుద్ధం
- హరీశ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : హరీశ్రావు ఎంత బాగా పనిచేసినా అతడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవి దక్కనివ్వరని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు మంత్రి పదవి ఇవ్వరని హరీశ్రావు అన్న మాటలకు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్రావు ఎంత బాగా పని చేసినా ఆయనకు కేసీఆర్ సీఎం పదవిని ఇవ్వరని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన హరీశ్.. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవినికి కొనుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని పరోక్షంగా సీఎం రేవంత్ గురించి వ్యాఖ్యానించారు. హరీశ్ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్బాబు ఖండించారు. తన వ్యాఖ్యలను హరీశ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే.. తన వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటానని హరీశ్ పేర్కొన్నారు. మరోవైపు, హరీశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సూచించారు. అయినా హరీశ్రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.