Homeజిల్లా వార్తలునాలుగు నెలలుగా జీతాలు ఇయ్యలే!

నాలుగు నెలలుగా జీతాలు ఇయ్యలే!

– పూర్వ వీఆర్‌ఏల అవస్థలు

– జీతాలు ఇవ్వాలని వేడుకోలు

ఇదేనిజం, నర్సంపేట : వీఆర్‌ఏలను( గ్రామ రెవెన్యూ సహాయకులు) వారి విద్యార్హతలు బట్టి ఆయా శాఖల్లో రికార్డు, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేశారు. ఏడాది ఆగస్టు నుంచి విధుల్లో చేరిన వీరు నాలుగు నెలల నుంచి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ రెవెన్యూ ఉద్యోగుల వ్యవస్థలు ప్రభుత్వం రద్దుచేసి పనిచేస్తున్న వారందరినీ ఉద్యోగులుగా గుర్తించి సర్వీసు క్రమబద్ధీకరించింది. ఈ ఏడాది జూలై 24న ప్రభుత్వ ఉత్తర్వులు రాగా ఆగస్టు 10న వారికి కేటాయించిన శాఖల్లో జాయిన్‌ కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నర్సంపేట డివిజన్‌ వ్యాప్తంగా సుమారు 200 మందికిపైగా సహాయకులు వివిధ కార్యాలయాల్లో ప్రతీరోజు క్రమం తప్పకుండా వెళుతూ అప్పగించిన విధులను సక్రమంగా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న వీరు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నాలుగు నెలలుగా జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. తమకు వెంటనే జీతాలు విడుదల చేయాలని కొత్త ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కనీస అవసరాలు తీర్చుకోలేక పోతున్నా
జీతాలు సమయానికి అందకపోవడంతో ఇంట్లోకి నిత్యవసర సరుకుల కొనుగోలు చేయడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. పేరుకే గవర్నమెంట్‌ ఉద్యోగం డబ్బులు లేకపోవడంతో నానా ఇబ్బంది పడుతున్నాం. కొత్త ప్రభుత్వం మా పైన దృష్టి సారించి జీతాలు విడుదల చేయాలని కోరుతున్నాం.
– బోట్ల రాజేందర్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ దుగ్గొండి

రోజు అప్పులు చేయాల్సి వస్తుంది
నల్లబెల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను. జీతాల డబ్బులు రాకపోవడంతో రోజు అప్పులు చేయాల్సి వస్తుంది. విలీన వీఆర్‌ఏల ఇబ్బందులను కొత్త ప్రభుత్వం తెలుసుకొని జీతాలు ఇవ్వాలి.
– గండు ప్రవీణ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ నల్లబెల్లి

Recent

- Advertisment -spot_img