హైదరాబాద్ః వ్యాక్సిన్ వచ్చేంత వరకు పండగల వేళ జాగ్రత్తగా ఉండండని పీఎం నరేంద్రమోడీ ప్రజలను హెచ్చరించారు. బయటకి వస్తే మాస్కు పెట్టుకోవడం, ఇతర కొవిడ్-19 నిబంధనలను పాటించడం మరచిపోవద్దని సూచించారు.
నవరాత్రులు, దసరా, దీపావళి, ఈద్, గురునానక్ జయంతి, క్రిస్ట్మస్ పండుగలు వస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని దేశవాసులను ప్రధాని అప్రమత్తం చేశారు.
మంగళవారం (అక్టోబర్ 20) సాయంత్రం 6 గంటలకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని, రికవరీ రేటు బాగా మెరుగు పడిందని ప్రధాని తెలిపారు. కరోనా మరణాల రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు.
దేశంలో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. వీటిలో కొన్ని కీలక దశలో ఉన్నాయని చెప్పారు.
దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 5500 మందికి కరోనా సోకిందని మోదీ తెలిపారు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ప్రతి పది లక్షల జనాభాలో 25 వేల మంది వైరస్ బారిన పడ్డారని తెలిపారు.
కరోనాతో పోరాటంలో ‘సేవా పరమో ధర్మ:’ మంత్రమే ప్రధానంగా భావించి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నిస్వార్థ సేవ చేస్తున్నారని కొనియాడారు.
దేశంలో కరోనా కేసులు నమోదైన తర్వాత ప్రధాని మోదీ 7వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘ఈ రోజు 6 గంటలకు మీకో విషయం చెబుతా..’ అంటూ ఆయన మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ట్వీట్ చేశారు. దీంతో ప్రధాని ఏం చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.