న్యూఢిల్లీ: సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. మోడీ మన్ కీ బాత్ వీడియోలకు సుమారు 10 లక్షల డిస్లైకులు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు మోడీ పట్ల ఉన్న క్రేజ్ కాస్తా ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంట్రా అని బీజేపీ నేతలు తలలుపట్టుకుంటున్నారు. ఆయన ఏ వీడియో పోస్టు చేసిన లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చేవి. ఇప్పుడు మోడీ హవా, ప్రభావం ఎందుకు తగ్గిందని ఆరా తీస్తున్నారు.
కామెంట్లను హైడ్ చేసిన పీఎంఓ
ఆగస్టు 30న నిర్వహించిన మన్ కీ బాత్ వీడియోను బీజేపీకి చెందిన యూ ట్యూబ్ ఛానల్, పీఎంఓ ఇండియా, నరేంద్ర మోదీ యూ ట్యూబ్ ఛానళ్లలో పోస్టు చేశారు. ఈ వీడియోలకు వచ్చిన లైకులతో పోల్చుకుంటే ఊహించని విధంగా డిస్ లైకులు రావడం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. కామెంట్లు, డిస్ లైకులు రావడంతో విసుగు చెందిన ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు పీఎంఓ యూ ట్యూబ్ ఛానల్ లో కామెంట్లు కన్పించకుండా చేశారు. ఇప్పటి వరకు సడక్-2 ట్రైలర్ కు ఎక్కువగా డిస్ లైకులు రాగా, ఆ తరువాత స్థానం మన్ కీ బాత్ దక్కించుకుని నవ్వులపాలవుతోంది.