న్యూఢిల్లీః మాతృ భాషలోనే బోధించడం వల్ల విద్యార్థులు విషయాలను సులువుగా అర్ధం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. ‘21వ శతాబ్దంలో పాఠశాల విద్య’ పేరుతో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన శిక్షా పర్వ్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. విద్యార్థులపై ఒత్తిడిని తొలగించేందుకే ‘జాతీయ విద్యావిధానం-2020’ను తీసుకొచ్చామని గుర్తు చేశారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభించడం ద్వారా విద్యార్థులు బహుముఖ జ్ఞానం పొందేందుకు వీలుంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
జాతీయ విద్యావిధానం-2020 ఆమోదించిన తర్వాత బోధన భాషపై చాలా చర్చ జరుగుతోందన్నారు. జపాన్, ఐర్లాండ్, పోలాండ్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోందని మోడీ గుర్తు చేశారు. అంతేకాకుండా చిన్నారులు వారి ఇంట్లో ఏ భాష వింటారో, అదే భాషలో బోధిస్తే సులభంగా ఆర్థం చేసుకుంటారని మోడీ సూచించారు. ఎన్పీఈ-2020 అమలులోభాగంగా టీచర్లను గైడ్ చేసేందుకు ‘శిక్షా పర్వ్’ను విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 8 నుంచి 25 వరకు నిర్వహించే ఇందులో కొత్త విద్యావిధానంలోని వివిధ అంశాలపై వెబినార్లు, వర్చువల్ సమావేశాలు ఉంటాయి.