- వందలాది పోలీసులు మోహరింపు
- ఖాకీలని మర్చిపోయి రౌడీల్లా ప్రవర్తన
- బీఆర్ఎస్వీ నేతలపై విచక్షణ రహితంగా దాడి
- పోలీసుల తీరుపై మండిపడుతున్న నిరసనకారులు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీసులు రౌడీల్లా ప్రవర్తించారు. డీఎస్సీ వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్వీ నేతలను చావ బాదారు. దుర్భాషలాడుతూ వారు పోలీసులనే విషయాన్ని మర్చిపోయారు. అయితే, ఇలాంటి పరిస్థితులు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలుంటే ప్రశ్నించే హక్కు కల్పిస్తామని కూడా ప్రకటించారు. కానీ, సీఎం రేవంత్రెడ్డి అయ్యాక ఆ విషయాలన్నీ మర్చిపోయారని, ఇలా వందలాది మంది పోలీసులతో నిరసన కారులపై దాడులు చేయించడమేంటని పలువురు మండిపడుతున్నారు. టీఆర్ఎస్వీ నేతలు శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యంగా దాడులు చేసి, వారిని అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్లో అక్కడి నుంచి తరలించారు. అక్కడున్న మరికొంత మంది నాయకులు తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. తమపై దాడులు చేయటమేంటని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇక ఓయూలోని ఎన్ఆర్ఎస్ హాస్టల్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన సుమారు 300 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలోని పలు హాస్టళ్ల వద్ద పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య డిమాండ్ చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. గ్రూప్-2, 3లో పోస్టుల సంఖ్య పెంచిన తర్వాతే వాటికి సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.