Homeసినిమావిద్యుదాఘాతంతో ప్రభాస్‌ అభిమాని మృతి

విద్యుదాఘాతంతో ప్రభాస్‌ అభిమాని మృతి

  • మరో యువకుడికి గాయాలు
  • సలార్‌ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా ఘటన
  • ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం

ఇదేనిజం, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. సలార్‌ సినిమా విడుదల సందర్భంగా.. రంగా సినీ కాంప్లెక్స్‌ ఎదుట ఓ ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్‌ అభిమాని బాలరాజు (27) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు చిన్న వ్యాపారం చేస్తూ కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. సలార్‌ సినిమా విడుదల సందర్భంగా స్నేహితులతో కలిసి ప్రభాస్‌ ఫ్లెక్సీ తయారు చేయించాడు. అనంతపురం నుంచి బాలరాజు స్నేహితులు, ప్రభాస్‌ అభిమానులు ధర్మవరం వచ్చారు. స్వయంగా వారే కడుతుండగా ఫ్రేమ్‌కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంటు తీగలను తాకడంతో బాలరాజు కరెంట్‌ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. గజేంద్ర అనే యువకుడికి గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి మరో నలుగురు యువకులు బయటపడ్డారు. బాలరాజు మృతితో స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మవరం వన్‌టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలరాజు మృతితో బంధువులు, ప్రభాస్‌ అభిమానులు ధర్నాకు దిగారు. కరెంటు తీగలు కిందకు వేలాడుతుండటం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు బంధువులు ఆరోపించారు. బాలరాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండు చేశారు. ధర్మవరం వన్‌టౌన్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిరసన తెలుపుతున్నవారిని అక్కడి నుంచి పంపేశారు.

Recent

- Advertisment -spot_img