HomeSocial Mediaభార్యాభర్తలను కలిపిన ప్రజాపాలన

భార్యాభర్తలను కలిపిన ప్రజాపాలన

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పదిహేనేళ్లుగా కనీసం పలకరించుకోకుండా విడివిడిగా ఉంటున్న వృద్ధ దంపతులను ‘ప్రజా పాలన’ ఒకటి చేసింది. అధికారుల చొరవ.. పథకాలపై హామీతో స్పర్థలు వీడి జీవన మలిసంధ్యలో చేతులు కలిపారు. ఆ దంపతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేట్‌కు చెందిన గొంగుపల్లి నరసింహులు (70), లక్ష్మమ్మ(65). వీరికి సుభానయ్య(40) సురేశ్‌ (35) కుమారులు. ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకొని భార్యాపిల్లలతో లాలాపేట్‌లోనే వేర్వేరు ఇళ్లలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. నరసింహులు, లక్ష్మమ్మ చిన్న చిన్న గొడవల వల్ల పదిహేనేళ్ల క్రితం విడిపోయారు. కలిసి ఉండాలంటూ గ్రామస్థులు ఎన్నోసార్లు నచ్చచెప్పినా వినిపించుకోలేదు. నరసింహులుకు వృద్ధాప్య ఫించన్‌ వస్తోంది.

ఆయన ఒంటరిగా రేకుల షెడ్డులో ఉంటున్నాడు. లక్ష్మమ్మ కూడా మరో రేకుల షెడ్డులో ఉంటోంది. ఆమె అవసరాలకు కొడుకులు డబ్బు ఇస్తున్నారు. శుక్రవారం నరసింహులు తనకు ఇల్లు కావాలంటూ.. లక్ష్మమ్మ తనకు పింఛన్‌ కావాలంటూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు.. దరఖాస్తుల్లో ఒక్కరి పేరే ఎందుకు ఉందని ఇద్దరినీ అడిగితే తాము ఎప్పుడో విడిపోయామని చెప్పారు. ఎంపీడీవో ఆంజనేయులు, ఉప తహసీల్దార్‌ కృష్ణ, సర్పంచ్‌ రాంరెడ్డి ఆ దంపతులతో మాట్లాడారు. ముసలితనంలో విడివిడిగా ఉండడం వల్ల ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నారని, కలిసి ఉంటే ఒకరినొకరు తోడుగా ఉంటారని నచ్చజెప్పారు. కలిసి ఉంటే కోరిన విధంగా ఇల్లు, పింఛన్‌, సబ్సిడీపై గ్యాస్‌ ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. చివరగా వృద్ధ దంపతులు కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. ఎట్టకేలకు వీరిని ప్రజాపాలన ఒకటి చేసింది

Recent

- Advertisment -spot_img