ఇదేనిజం, తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే కోర్టుకు లాగుతామంటూ హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేరని.. అటువంటిది ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దేశ భద్రతకు సంబంధించిన అంశం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో, వీడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందన్నారు. కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల కర్మ. కృష్ణా జలాల వాటాల్లో 299 టీఎంసీలపై సంతకం పెట్టింది కేసీఆర్ కాదా? కేంద్రంలో హంగ్ వస్తుంది.. చక్రం తిప్పుతానని కేసీఆర్ కలలు కంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి తప్పుడు ప్రచారాలు
రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తుందని భావించి అటూ బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్రెడ్డి ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు తీసివేసేది లేదని ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు.
పెద్దపల్లి ఎంపీ బీజేపీ గూటికి..
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకున్నారు. సంక్షేమ పథకాల అమలు, దేశాభివృద్ధి కోసం నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేశారని, ఆయన్ను మూడోసారి ప్రధాని చేయడం కోసం బీజేపీ చేరినట్లు వెంకటేష్ నేతకాని అన్నారు.