సిద్దిపేట : ఝూటా మాటల బీజేపీ చిట్టాను రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు బట్టబయలు చేశారు. మొత్తం 11 అబద్దాలను మీడియా ముందు హరీష్ రావు బయటపెట్టారు.
రాష్ర్ట బీజేపీ నాయకులు తమ వైఖరితో బీజేపీని భారతీయ ఝాటా పార్టీగా మార్చేశారని పేర్కొన్నారు. పూటకో పుకారు పుట్టించి.. గంటకో అబద్దం మాట్లాడటం బీజేపీ నాయకుల నైజం అని మండిపడ్డారు.
అబద్దాలే పునాదిగా బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు తెరతీసిందన్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు మొదలుకొని గ్రామస్థాయి వార్డు నేత దాకా అందరూ అబద్దాలు ఆడేవారే అని ధ్వజమెత్తారు.
సత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తిని విస్మరించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యమేవ జయతే అని వారు నమ్ముతున్నారని విమర్శలు గుప్పించారు.
హరీశ్ చెప్పిన బీజేపీ అబద్ధాల చిట్టా..
1- టీఆర్ఎస్ ప్రభుత్వం, బీడీ కార్మిక మహిళలకు ఇస్తున్న పెన్షన్ 2016 రూపాయలలో, 1600 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారనడం అబద్ధమన్నారు.
2- కేసీఆర్ కిట్ పథకం కింద ఇచ్చే డబ్బు 13 వేలలో.. 6 వేల రూపాయలు కేంద్రం ఇస్తుందని ఒకరు, 8 వేలు ఇస్తుంది అని ఇంకొకరు అబద్ధాలు చెప్తున్నారు.
3- గొర్రెల యూనిట్లలో రూ. 50 వేలు బీజేపీ ఇస్తుంటే కేవలం రూ. 25 వేలే టీఆర్ఎస్ ఇస్తున్నదట. ప్రజలను గొర్రెలుగా భావించే వారే ఇటువంటి అబద్ధాలు చెప్పగలరు.
4- కేంద్రం రూ. 25 కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్ చేగుంటకు మంజూరు చేస్తే టీఆర్ఎస్ దాన్ని గజ్వేల్లో పెట్టుకున్నదని అంటున్నారు. గజ్వేల్లో ఈఎస్ఐ ఆస్పత్రి లేదు. చేగుంటకు ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు కాలేదు.. ఒక వేళ మంజూరు అయితే ఆధారం చూపించండన్నారు.
5- రేషన్ బియ్యం సబ్సిడీలో కిలోకు 29 రూపాయలు కేంద్రం భరిస్తుంటే కేవలం 1 రూపాయి మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం భరిస్తున్నదట. ప్రజలు తినే అన్నం మీద అబద్ధం.. ఉత్త గోబెల్స్ ప్రచారం.
6- పాలిటెక్నిక్ కాలేజ్ కు దుబ్బాకలో శంకుస్థాపన జరిగాక సిద్దిపేటకు తరలించారు అని అంటున్నారు. అసలదీ మంజూరు కాలేదు, శంకుస్థాపన అంతకంటే కాలేదు, సిద్దిపేటకు తీస్కపోలేదు.
7- కేసీఆరే మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాడని బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇది చోర్ ఉల్టా కోత్వాల్ కు డాటా అన్నట్టు ఉన్నది.
8- తెలంగాణా రైతులు పండించిన వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనేందుకు కేంద్రం రూ. 5,500 కోట్లు విడుదల చేసింది అని అంటున్నారు. ఇది పచ్చి బూటకం. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు.
9- డబ్బులు దొరికిన ఇల్లు మావాళ్ళది కాదు అని బీజేపీ నేతలు అంటున్నారన్నారు. మీవాళ్ళది కానప్పుడు నువ్వెందుకు ఉలిక్కిపడ్డవు ? అని హరీశ్ అన్నారు.
10- మాకు సంబంధించిన ఎనిమిది మంది ఇండ్ల మీద పోలీసులు దాడులు చేసి సోదాలు చేసారు అని అంటున్నారు. వాస్తవంగా నాలుగు ఇండ్లలోనే సోదాలు చేశారు. అందులో రెండు టీఆర్ఎస్ వాళ్లవి.. రెండు బీజేపీ వాళ్లవి.
11- సోదాలో దొరికిన డబ్బులు పోలీసులే పెట్టారు అని ఆరోపణలు చేస్తున్నారు. అడ్డంగా దొరికి పోయి, పైనుంచి అబద్ధం.. డబ్బులు తమవేనని స్వయంగా రఘునందన్ అత్తామామలు చెప్పిన వీడియోనే రుజువని హరీశ్ అన్నారు.