ప్రతీ ఎంపీ నెలకు రూ.1 లక్ష జీతాన్ని పొందుతారు. అంతేకాకుండా రోజుకు రూ.2 వేల చొప్పున అలవెన్సులు అందుతాయి. ఇవే కాకుండా నియోజకవర్గ అలవెన్సు కింద నెలకు రూ.70 వేలు, ఆఫీస్ ఖర్చుల కింద నెలకు మరో రూ.60 వేలు కూడా ప్రతీ ఎంపీకి చెల్లిస్తారని పీఆర్ఎస్ ఇండియా సమాచారం ద్వారా తెలుస్తోంది. దీంతో ప్రతీ ఎంపీకి నెలకు రూ.2.30 లక్షలతోపాటు రోజుకు రూ.2 వేల అలవెన్సు లభిస్తుంది.
ప్రధానికి నెలకు రూ.3 వేలు.. కేబినెట్ మంత్రులకు నెలకు రూ. 2 వేలు.. సహాయ మంత్రులకు నెలకు రూ. వెయ్యి అదనపు అలవెన్సులు లభిస్తాయి.
ఇక దేశంలో ఏ మూలన ఉన్న ఎంపీ అయినా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఎంపీ విధులకు సంబంధించి ప్రయాణించేందుకు ట్రావెలింగ్ అలవెన్సులు కూడా ఉంటాయి. ప్రతీ ఎంపీకి ఏ రైలులోనైనా ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు టికెట్ ఒకటి ఫ్రీగా ఇస్తారు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఎప్పుడైనా, ఏ రైలులోనైనా ప్రయాణించేందుకు వీలు ఉంటుంది.