– కొంపముంచిన నోటి దురుసు
– టీవీల్లో దూకుడు.. ప్రజలకు దూరం
– సీనియర్ల నుంచి సహాయనిరాకరణ
– తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్
– పనిచేయని రేవంత్ పలుకుబడి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: నోటి దురుసుతనం అద్దంకి దయాకర్ కొంప ముంచింది. నిత్యం టీవీల్లో ఊగిపోయే మాట్లాడే అద్దంకి దయాకర్ ప్రస్తుతం తుంగతుర్తి టికెట్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఆయన అహంకార దోరణి, నోటి దురుసుతనమే కొంపముంచిందని కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ వివాద రహితుడు మందుల శ్యామేలుకు కాంగ్రెస్ టికెట్ దక్కింది. గతంలో మాలమహానాడు అధ్యక్షుడిగా పనిచేసిన అద్దంకి దయాకర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిత్యం టీవీల్లో ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడుతుంటారు. అయితే ఈ దూకుడుతనమే.. సమయం సందర్భం లేకుండా మాట్లాడటమే ఆయనకు టికెట్ దక్కకుండా చేసిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి వాడిన అసభ్య పదం తీవ్ర దుమారం రేపింది. అదే సభలో ఉన్న జానారెడ్డి, ఉత్తమ్ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. కోమటిరెడ్డి అభిమానులంతా ఈ కామెంట్లతో తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ కామెంట్లు చేసినందువల్లే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో మునుగోడు ప్రచారానికి కూడా రాలేదు. ఈ అంశాన్ని అధిష్ఠానం సీరియస్ గా తీసుకున్నది. ప్రస్తుతం టికెట్ ఇవ్వకపోవడానికి అది కూడా ఓ కారణమైంది.
అద్దంకికి రేవంత్ అండ
ఇక మొదటి నుంచి అద్దంకి దయాకర్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకే అద్దంకి దయాకర్ను ఎంకరేజ్ చేసినట్టు సమాచారం. అయితే అద్దంకి దయాకర్కు అదే ప్రతిబంధకంగా మారింది. మరోవైపు ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టించుకోరన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గానికి ముఖ్య నాయకులు వెళ్లినప్పుడు కూడా అద్దంకి వెళ్లరన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అద్దంకిని పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది.
శ్యామూల్పై ఏకాభిప్రాయం
తుంగతుర్తి టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమంది పోటీ పడ్డా.. చివరకు మందుల శ్యాముల్కు టికెట్ దక్కింది. శ్యామూల్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో సీనియర్ లీడర్లంతా అద్దంకి దయాకర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అద్దంకికి తప్ప ఏ నేతకు టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని పలువురు సీనియర్ లీడర్లు అధిష్ఠానానికి తేల్చి చెప్పడంతో శ్యామూల్కు టికెట్ దక్కింది. మొత్తానికి నోటి దురుసుతనం, సమయం సందర్భం లేకుండా మాట్లాడటం తదితర కారణాలతో ఈ సారి అద్దంకి మీద ఎఫెక్ట్ చూపించింది