Homeహైదరాబాద్latest Newsసాఫీగా రుణమాఫి.. పకడ్బందిగా చర్యలు

సాఫీగా రుణమాఫి.. పకడ్బందిగా చర్యలు

ఇదేనిజం, సిరిసిల్ల జిల్లా ప్రతినిధి : జిల్లాలో రైతు రుణమాఫీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పకడ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు రుణ మాఫీ సన్నద్దతపై గురువారం బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో జరిగిన రుణమాఫీ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 61,343 రైతులు ఉండగా ఇందులో 40,567 మంది రైతులకు 240 కోట్ల రూపాయల రుణం మాఫీ చేయడం జరిగిందని, 10,756మంది రైతులకు ప్రాసెస్ లో ఉందన్నారు. మిగిలినవి వివిధ సాంకేతిక (ఆధార్ లింకేజీ లేకపోవడం, ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం, మరణించిన రైతులు) తదితర కారణాల వలన రుణమాఫీ జరగలేదని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 మధ్యలో తీసుకున్న రైతుల రుణాలు మాఫీ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ రుణమాఫీ ఫలితం చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. గతంలో వచ్చిన విధంగా సాంకేతిక సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకుల వారీగా రైతుల రుణ ఖాతా వివరాలు కలెక్టర్ ఆరా తీశారు. రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగానే రైతుల బ్యాంకు ఖాతా ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభించాలని, ఆధార్ నెంబర్ ఆధారంగా డూప్లికేట్ బ్యాంకు ఖాతాలను గుర్తించి శనివారం నాటికి నివేదిక సమర్పించాలని కోరారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, డి.ఏ.ఓ భాస్కర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img