భయంతో పరుగులు తీసిన సిబ్బంది
అసలు విషయం తెలిసి.. ఊపిరి పీల్చుకున్నరు
రహస్యంగా నిర్వహించిన మాక్డ్రిల్
హైదరాబాద్ః శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మళ్లీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ శబ్దాలతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడున్న సిబ్బందికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణాలను చేతుల్లో పెట్టుకోని బయటకు పరుగులు తీశారు. ఆగస్టు 20న ఇదే కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా ఏర్పడిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మరణించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రమాద తీవ్రతను ప్రత్యక్షంగా అనుభవించినట్లు బయటకు వచ్చిన సిబ్బంది చెప్పారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది అప్రమత్తత పరిశీలన కోసం రహస్యంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అక్కడికి వచ్చిన అధికారులు అసలు విషయం చెప్పడంతో సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. అమ్మో ఇదే నిజమైతే పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా ఉంటాయా అంటూ చర్చించుకున్నారు. ఆపత్కాల సమయంలో ఎలా ధైర్యంగా ఉండి ప్రమాదం నుంచి బయటపడాలో అనుభవపూర్వకంగా అభ్యాసం అయినట్లు సిబ్బంది పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
సిబ్బంది అవగాహన కోసమేః సీఎండీ ప్రభాకర్ రావు
ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్ నిర్వహించాం. ఈ విషయం కేవలం డైరెక్టర్లకు మాత్రమే సమాచారం ఉంది. విద్యుత్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి తెలియనివ్వలేదు. అందుకే అది నిజమైన అగ్నిప్రమాదం అనుకొని సిబ్బంది భయంతో పరుగులు తీసి ప్రమాదం తీవ్రతను స్వయంగా అంచనా వేయగలిగారు.