సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఎక్కవగా బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. మరోసారి మోదీనే ప్రధాని అవుతారనే సంకేతాలు ఇచ్చాయి. ఆ పోల్స్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై పడింది. దీంతో సోమవారం భారీ లాభాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు లాభాల్లో ఉన్న కంపెనీలు అదే పంథాను కొనసాగిస్తాయనే భావనే దీనికి ప్రధాన కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 1,808 పాయింట్ల లాభంతో 75,769 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 దగ్గర కొనసాగుతోంది. రెండు సూచీలూ ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను నమోదుచేయడం విశేషం. పవర్గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.